పాక్ తోక వంకరే: మరోసారి కాల్పులు, తిప్పికొట్టిన భారత్
శ్రీనగర్: భారత్ ఎలా సమాధానమిచ్చినా.. పాకిస్థాన్ తన వైఖరిని మాత్రం మార్చుకోవడం లేదు. ఓవైపు నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలు చేపట్టిన దాడుల నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. మరోవైపు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది.
గడిచిన 48 గంటల్లో ఐదోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ బలగాలు.. భారత సైన్యంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి.
అఖ్నూర్ సెక్టార్లోని చప్రియల్, సమ్వాన్ ప్రాంతాల్లో పాక్ బలగాలు శుక్రవారం ఉదయం కాల్పులు జరిపాయి. దీంతో అప్రమత్తమైన భారత జవాన్లు.. పాక్ బలగాలకు ధీటుగా సమాధానమిచ్చారు.
దాదాపు గంటపాటు జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని జమ్మూ డిప్యూటీ కమిషనర్ సిమ్రన్దీప్ సింగ్ తెలిపారు.
సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న దాదాపు వెయ్యి గ్రామాలను ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్లు సరిహద్దు పరిస్థితిపై అధికారులు, భద్రతా దళాలతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.