పాక్ స్వతంత్ర దినోత్సవం: కాశ్మీర్ లో కలకలం
కాశ్మీర్: పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈనెల 14వ తేది (ఆదివారం) కాశ్మీర్ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో కలకలం చెలరేగింది. పూంఛ్ జిల్లాలో పాక్ బలగాలు (మిలటరీ) కాల్పులు జరిపాయి.
అదే విధంగా బుద్ధ అమరనాథ్ యాత్రికులపై గ్రెనేడ్ లతో దాడి చేశారు. పూంఛ్ జిల్లా సరిహద్దులో ఆదివారం ఉదయం పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పోడిచింది. భారత జవాన్లను లక్షంగా చేసుకుని కాల్పులు జరిపారు.
మిషన్ గన్స్, మోర్టార్ రాకెట్లతో దాడి చేశారు, దీనిని తిప్పి కొట్టే క్రమంలో భారత్ బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఆదివారం సాయంత్రం వరకు కాల్పులు కొనసాగుతున్నాయి.
ఎవరైనా గాయపడ్డారా ?మరణించారా అని ఇప్పుడే చెప్పలేమని భారత్ భద్రతాబలగాల ప్రతినిధులు తెలిపారు. దాదాపు నాలుగు నెలల తరువాత ఇరు దేశాల బలగాల మధ్య కాల్పులు జరగడం ఇదే మొదటి సారి.
పూంఛ్ జిల్లాలోనే ప్రఖ్యాత బుద్ధ అమర్ నాథ్ దేవాలయానికి వెలుతున్న యాత్రికులపై ముగ్గురు ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. ఈ దాడిలో 10 మంది యాత్రికులు గాయపడ్డారు.
గాయపడిన యాత్రికులను జమ్ములోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని భద్రతా బలగాల అధికారులు తెలిపారు.
బాంబులు విసిరిన ముగ్గురు ఉగ్రవాదులలో ఇద్దరిని భక్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఓ ఉగ్రవాది అక్కడి నుంచి పరారైనాడని పోలీసు అధికారులు తెలిపారు.
ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ కార్యాలయంలో పాక్ స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు. పాక్ కమిషనర్ అబ్దుల్ బాసిత్ పాక్ జాతీయ జెండాను ఎగరవేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ ఆజాదీ నేపథ్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ తో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.