పాక్కి గట్టి షాక్: చొరబాటుకు యత్నిస్తే.. 13 మంది ఉగ్రవాదులను కాల్చి చంపేశారు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులకు, భారత భద్రతా దళాలకు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి భారత్లోకి చొరబడేందుకు యత్నించిన 13 మంది ఉగ్రవాదులను మనదేశ సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పలువురు భారత సైనికులు కూడా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Recommended Video
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) నుంచి ఉగ్రవాదులు భారత్లో ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం అందుకున్న భద్రతా దళాలు సంబంధిత ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో అక్రమంగా సరిహద్దులోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులు సైన్యం కంటపడ్డారు.
వెంటనే వారిపై భద్రతా దళాలు తూటాల వర్షం కురిపించింది. దీంతో 13 మంది ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు.మార్చి 28 నుంచే ఉగ్రవాదులు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు కుట్రలు పన్నుతున్నారనే సమాచారం ఉందని ఓ సీనియర్ సైన్యాధికారి తెలిపారు.
ఈ నేపథ్యంలోనే సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురుకావడంతో వెంటనే అప్రమత్తమైన సైనికులు ఉగ్రవాదులపై కాల్పులు జరిపి మట్టుబెట్టాయని తెలిపారు. ఉగ్రవాదుల వద్ద భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు ఉన్నట్లు గుర్తించారు.
ఇది ఇలావుంటే, భారీ నార్కో టెర్రర్ మాడ్యూల్ను జమ్మూకాశ్మీర్ పోలీసులు ఛేదించారు. సోమవారం ఉదయం ఆరుగురు నార్కో ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరికి జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీరి నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.