భారత్లోకి అక్రమంగా పాక్ గూఢచారి: పట్టేసిన బీఎస్ఎఫ్, విచారణలో ఏం చెప్పాడంటే.?
జైపూర్: పాకిస్థాన్ తన వక్ర బుద్ధిని మానుకోవడం లేదు. ఏదో రకంగా భారతదేశానికి కీడు చేయాలనే ఆలోచనలోనే ఆ దేశం ఎప్పుడూ ఉంటోంది. తాజా ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గూఢచర్యం చేసేందుకు పాకిస్థాన్ నుంచి మనదేశంలో అక్రమంగా చొరబడిన ఓ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళాలు(బీఎస్ఎఫ్) అదుపులోకి తీసుకున్నాయి.
రాజస్థాన్ బర్మేర్లోని భారత్-పాక్ సరిహద్దు సమీపంలో బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ గూఢచారిని పట్టుకున్నారు. విచారణలో ఆ వ్యక్తి పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు తెలిపాడు. పాకిస్థాన్లోని ఖొఖ్రాపర్ వరకు రైలులో వచ్చిన అతడు.. అక్కడి నుంచి పాక్ ఆర్మీ సాయంతో సరిహద్దు దాటినట్లు చెప్పుకొచ్చాడు.
అతడు సరిహద్దులో బారికేడ్ల కింది నుంచి పాకుకుంటూ దేశంలోకి చొరబడి ఉంటాడని భద్రతా దళాలు భావిస్తున్నాయి. కాగా, బీఎస్ఎఫ్ జవాన్ల విచారణలో అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. బీఎస్ఎఫ్, భారత సైన్యానికి సంబంధించిన కార్యకలాపాలను తెలుసుకునేందుకు అతడు మనదేశంలో ప్రవేశించినట్లు తెలిసింది.
తన మేనమామే తనను ఇక్కడికి పంపాడని బీఎస్ఎఫ్ విచారణలో సదరు గూఢచారి చెప్పినట్లు సమాచారం. అయితే, దర్యాప్తు సమయంలో అతడు పదే పదే మాట మార్చుతుండటంతో అతడ్ని జైపూర్ కు తరలించి మరోసారి విచారించనున్నారు.