పాక్ కుట్రలు: సరిహద్దు వెంట భారీ తుపాకులు, మోర్టార్లతో దాడులు, భారత్ ధీటుగా..
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. అర్టిల్లరీ గన్స్, మోర్టార్స్, ఇతర భారీ ఆయుధాలను ఉపయోగించి భారత సైన్యంపై దాడులకు పాల్పడింది. గురువారం మధ్యాహ్నం కుప్వారాలోని కెరన్, మక్కల్ సెక్టార్లలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.
అయితే, భారత భద్రతా బలగాలు పాక్ సైన్యానికి ధీటుగా బదులిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి కూడా పాక్ సైనికులు కాల్పులకు పాల్పడుతున్నారు. ఈ కాల్పుల్లో ఇరువైపుల కూడా ప్రాణ నష్టం జరిగింది. అయితే, పాక్ వైపున ఎంతమంది మరణించారనేది తెలియరాలేదు.
నియంత్రణ రేఖ వెంబడి వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. కుప్వారా జిల్లాలోని నౌగాం సెక్టార్లో భారత జవాన్లపై కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా, నలుగురికి గాయాలయ్యాయి.
ఇక, పూంఛ్ సెక్టార్లో చోటు చేసుకున్న మరో ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. మోర్టారు షెల్లింగ్ దాడులకు కూడా పాక్ పాల్పడుతోందని భారత సైన్యం తెలిపింది.
గత ఎనిమిది నెలల్లో పాకిస్థాన్ 3వేల సార్లకుపైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 2003లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు చేసుకున్నాయి. అయినా, పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తరచూ తూట్లు పొడుస్తూనే ఉంది. ఇప్పటి వరకు వేలసార్లు కాల్పులకు తెగబడటం గమనార్హం. ఒక సెప్టెంబర్ నెలలోనే 47 సార్లు, గత ఎనిమిది నెలల్లోనే 3వేలసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ప్రతి ఏడాది శీతాకాలంలోనే పాక్ కాల్పులకు దిగుతుండటం గమనార్హం.