భారత్వైపు రాళ్లు, పాకిస్తానీయుల అతిప్రవర్తన: 'పాక్ను నమ్మడానికి వీల్లేదు'
న్యూఢిల్లీ: పాకిస్తాన్కు చెందిన కొందరు వాఘా సరిహద్దుల్లో భారత్ వైపు రాళ్లు విసిరారు. వాఘా-అటారీ సరిహద్దు వద్ద జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం సందర్భంగా పాక్ సందర్శకులు అతిగా ప్రవర్తిస్తుండటంపై భారత సరిహద్దు భద్రత దళం(బీఎస్ఎఫ్) అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆదివారం పాకిస్థాన్ రేంజర్స్తో సమావేశమై విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లింది. రోజూ సాయంత్రం రెండు దేశాలు జెండా అవతనం చేసి, గేట్లు మూసే సమయంలో రిట్రీట్ నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమానికి రెండు దేశాల నుంచి సందర్శకుల తాకిడి ఉంటుంది. ఆ సమయంలో రాళ్లు విసరడం గమనార్హం.
పాక్ను నమ్మడానికి వీల్లేదు
పాకిస్తాన్ను ఏమాత్రం నమ్మడానికి వీల్లేదని సరిహద్దు ప్రజలు చెబుతున్నారు. బార్డర్లో పాకిస్థాన్ సైన్యం మళ్లీ కాల్పులు జరిపే అవకాశముండటంతో జమ్మూ ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు.
అఖ్నూర్ ప్రాంతంలో ఎల్వోసీ వెంబడి పాకిస్థాన్ దళాలు శనివారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సైనిక పోస్టులను, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయి.
పౌరులను పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకుంటుందన్న సంగతి తమకు తెలుసని ఇప్పుడు కాల్పులు విరమించినా ఆ దేశాన్ని నమ్మడానికి వీల్లేదని అఖ్నూర్కు చెందిన పల్లన్వాలా గ్రామవాసి సూరత్ సింగ్ తెలిపారు. పిల్లలను, మహిళలను, వృద్ధులను సురక్షిత ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు తరలిస్తున్నట్లు మరో గ్రామస్తుడు చెప్పారు.
మగవాళ్లు పగలు గ్రామాల్లోనే ఉంటూ రాత్రివేళల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఉంటున్నారు. పంటలను, పశుసంపదను కాపాడుకోవడానికి తాము గ్రామాల్లో ఉండక తప్పడం లేదన్నారు. అయితే పిల్లల చదువుల గురించే తమ ఆందోళనంతా అని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ము కాశ్మీరు ఉపముఖ్యమంత్రి ఆదివారం శిబిరాల్లోని ఏర్పాట్లను పరిశీలించారు.
ఆ పిటిషన్కు మద్దతు
పాకిస్థాన్ను తీవ్రవాద ప్రాయోజిత దేశంగా ప్రకటించాలని ఒబామా ప్రభుత్వాన్ని కోరుతూ ఆన్లైన్లో దాఖలైన ఒక పిటిషన్కు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో స్పందన లభించింది. అయిదులక్షల మంది దీనిపై సంతకాలు చేశారు. అనుకున్న దాని కంటే అయిదురెట్లు ఎక్కువ మంది ఈ పిటిషన్పై సంతకాలు చేశారు.
సెప్టెంబరు 21 వ తేదీన ఆర్జీ అనే పొడి అక్షరాలతో తనను తాను పేర్కొన్న ఓ వ్యక్తి ఈ ఆన్లైన్ పిటిషన్ను సిద్ధం చేశారు. దీనిపై ఒబామా సర్కారు స్పందించాలంటే... 30 రోజుల వ్యవధిలో లక్ష సంతకాలు అవసరం. అయితే, అందుకు అయిదురెట్లు అధికంగా సంతకాలు వెల్లువెత్తాయి. ఇంతటి స్పందనకు నోచుకున్న ఈ పిటిషన్పై 60 రోజుల వ్యవధిలో ఒబామా పాలనాయంత్రాంగం స్పందిస్తుందని భావిస్తున్నారు.