అలర్ట్.. అలర్ట్... గుజరాత్ తీరం గుండా ఉగ్రవాదులు... ఐబీ హెచ్చరిక, అప్రమత్తమైన కోస్టల్ పోలీసులు
న్యూఢిల్లీ : కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు తర్వాత అలజడి సృష్టించేందుకు ఉగ్ర మూకల విఫలయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే గుజరాత్ తీరం గుండా దేశంలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారని నిఘా వర్గాలు తెలిపాయి. తీరప్రాంత భద్రతా దళాలు, బీఎస్పీ, కోస్ట్ గార్డు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దేశంలోకి ఉగ్రవాదులు ప్రవేశించేందుకు ప్రయత్నించారనే వార్తలతో ఒక్కసారిగా అన్ని విభాగాలు అలర్టయ్యాయి. తాజా పరిస్థితిని నిఘా, పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
గుజరాత్ తీరం గుండా ఉగ్రవాదులు ప్రవేశించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రమూకలకు పాకిస్థాన్ నేవీ శిక్షణ ఇచ్చిందని ఐబీ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు, కమాండోలు చిన్న చిన్న బోట్ల ద్వారా కచ్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. దీంతోపాటు కండ్ల, సిర్ క్రిక్ ప్రాంతం కూడా వారి జాబితాలో ఉందని తెలిపింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికతో గుజరాత్ కోస్ట్ గార్డ్ అప్రమత్తమైంది. వీరు నీళ్లలోనే దాడులు చేసేందుకు పాకిస్థాన్ నేవీ ట్రైనింగ్ ఇచ్చిందని .. ముఖ్యంగా పోర్టులు, షిప్పులను పేల్చివేసే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది.
కచ్, దీన్ దయాల్, ఇతర తీర ప్రాంత ఓడరేవులకు నిఘావర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. అంతేకాదు ప్రైవేట్ సంస్థల ఆదీనంలో ఉన్న ముంద్ర పోర్టును కూడా అప్రమత్తం చేశారు. ముంద్ర పోర్టుకు సెక్యూరిటీ లెవల్ 1 అలర్ట్ ఆదేశాలు జారీచేశామని పేర్కొన్నారు. దీంతో పోర్టు దరిదాపులను నిశీతంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా ? నీటిలో ఎవరైనా నక్కి ఉన్నారా అని కూడా పరిశీలిస్తున్నారు. ఐబీ హెచ్చరికలతో కోస్ట్ గార్డు, పోర్టు, కోస్టల్ పోలీసులు, ఇండియన్ నేవీ అధికారులు అలర్టయ్యారు.
Security enhanced at the Kandla port in view of inputs that 'Pakistani commando are likely to infiltrate into Indian territory through Kutchh area, through sea route to create communal disturbance or terrorist attack in Gujarat.' pic.twitter.com/viGS1MqDrZ
— ANI (@ANI) August 29, 2019