మా ఓపిక పరీక్షించొద్దు: భారత్కు నవాజ్ షరీఫ్ వార్నింగ్
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి భారత్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ తమ పౌరులను లక్ష్యంగా చేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కరాచీ: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి భారత్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ తమ పౌరులను లక్ష్యంగా చేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ పౌర ప్రాంతాలపై ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరుపుతోందని ఆరోపించారు.
భారత్ చర్యలను పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదన్నారు. బుధవారం నాడు భారత్ సైన్యం జరిపిన కాల్పులలో సైనికులు సహా 12 మంది పౌరులు మృతి చెందారని పాకిస్తాన్ పేర్కొంది.ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్ గురువారం హెచ్చరికలు జారీ చేశారు.
పౌర, మిలటరీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడారు. కాశ్మీర్ అంశం పాకిస్థాన్కు అసంపూర్తి అజెండాగా మిగిలిపోయిందన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఎల్వోసీ వెంబడి భారత్ చర్యలపై పాకిస్తాన్ సహనం వహిస్తోందన్నారు.
అయితే ఆ సహనం కొంతవరకు మాత్రమేనని, పౌరులను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాగా, పాకిస్తాన్ దళాల కాల్పుల్లో ముగ్గురు భారత సైనికులు అమరులయ్యారు. దీంతో ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ బుధవారం పాక్ పోస్టులపై భీకర కాల్పులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 12 మంది పాక్ సైనికులు మృతి చెందారు.