పాక్ ప్రతీకారం: వారి పార్సిళ్లు వెనక్కి, ముంబై విమానాలు బంద్!
న్యూఢిల్లీ: యూరి ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రయిక్ నేపథ్యంలో పాక్ - భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ జైళ్లలో మగ్గుతున్న భారత జాలర్లకు వారి బంధువులు పంపిస్తున్న పార్సిళ్లను ఆ దేశ జైలు అధికారులు తిప్పి పంపిస్తున్నారు.
గత 9 నెలల్లో సరిహద్దు జలాల్లో పట్టుబడిన గుజరాత్కు చెందిన 438 మంది, డయ్యుకు చెందిన 51 మంది జాలర్లు పాక్ జైళ్లలో ఉన్నారు. లేఖలు, ఆహార పదార్థాలు, దుస్తులు, మందులు తదితరాలను కరాచీ జైళ్లలోని జాలర్లకు బంధువులు పంపిస్తుంటారు. పాక్ అధికారులు వాటిని వారికి అందించేవారు. సర్జికల్ దాడుల అనంతరం పార్సిళ్లను వెనక్కి పంపిస్తున్నారు.
మరోవైపు, కరాచీ నుంచి ఢిల్లీ, ముంబై నగరాలకు నడిచే విమాన సర్వీసులను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(పీఐఏ) రద్దు చేసింది. యూరి ఉగ్రదాడి అనంతరం ఈ రెండు దేశాల మధ్య ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పీఐఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీఐఏ ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే లాహోర్-ఢిల్లీ మధ్య మాత్రం విమాన సర్వీసులు కొనసాగుతాయని పేర్కొంది. గత మూడు నాలుగు వారాలుగా కరాచీ-ఢిల్లీ, కరాచీ-ముంబై నగరాల మధ్య ప్రయాణించే వారి సంఖ్య విపరీతంగా తగ్గిపోవడంతో నష్టాలకు భయపడి పీఐఏ ఈ నిర్ణయం తీసుకుంది.
కరాచీ నుంచి భారత్లోని ఢిల్లీ, ముంబై నగరాల మధ్య నడిచే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు పీఐఏ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే లాహోర్-ఢిల్లీ మధ్య మాత్రం విమాన సర్వీసులు కొనసాగుతాయన్నారు. రద్దు చేసిన సర్వీసుల్లో ప్రయాణించేందుకు ఇదివరకే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.