సరిహద్దుల్లో కలకలం: మళ్లీ గగనతలంలోకి పాకిస్తాన్ డ్రోన్: 40 నిమిషాల పాటు చక్కర్లు
చండీగఢ్: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో.. సరిహద్దుల్లో భద్రతపరమైన వైఫల్యం మరోమారు కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన డ్రోన్ పాకిస్తాన్ వైపు నుంచి మన దేశ గగనతలంలోకి చొచ్చుకుని వచ్చింది. సుమారు 40 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. అయిదుసార్లు రెండు దేశాల మధ్య తిరిగింది. అయినప్పటికీ.. ఆ డ్రోన్ ను సరిహద్దు భద్రతా బలగాలు సకాలంలో గుర్తించలేకపోయాయి. అనంతరం దాన్ని కూల్చేయడానికి ప్రయత్నించగా.. ఆ డ్రోన్ వెనుదిరిగింది.
పాకిస్తాన్ వెళ్లడానికి సిద్ధపడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్: వచ్చేెనెల ప్రయాణం
మారణాయుధాల కోసం గాలింపు..
పంజాబ్ లో సరిహద్దు నగరమైన ఫిరోజ్ పూర్ సమీపంలోని హెచ్ కే టవర్ సమీపంలో ఈ డ్రోన్ తిరుగాడినట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు నిర్ధారించారు. ఆ డ్రోన్ తిరుగాడిన ప్రదేశంలో పంజాబ్ పోలీసులతో కలిసి ఉమ్మడి తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదుల కోసం ఈ డ్రోన్ ద్వారా ఆయుధాలను జారవిడిచి ఉండొచ్చనే అనుమానంతో ఆయా ప్రాంతాల్లో విస్తృత గాలింపు చర్యలు నిర్వహించారు. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. ఆ డ్రోన్ నిజంగా ఆయుధాలను జారవిడిచి ఉండి ఉంటే అవి ఎవరికి చేరుతారనే విషయంపై తమకు ఉన్న నెట్ వర్క్ ద్వారా ఆరా తీస్తున్నారు.
పాకిస్తాన్ అక్కసు
జమ్మూ కాశ్మీర్ ను స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత పాకిస్తాన్ తీవ్ర అసహనంతో ఉంటోంది. దెబ్బకు దెబ్బ తీయాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కమెండోలను మోహరింపజేసింది. పాకిస్తాన్ భూభాగంపై నుంచి తమ కార్యకలాపాలను కొనసాగిస్తోన్న జైషె మహమ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్రవాదులు భారత్ లో చొరబడటానికి సరిహద్దుల్లో కాపు కాస్తున్నారు. 500 మందికి పైగా ఉగ్రవాదులు సరిహద్దుల్లో మాటు వేశారంటూ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సైతం వెల్లడించిన విషయం తెలిసిందే.
మానవ ప్రయత్నాలు వృధా.. అందుకే డ్రోన్లు
ఈ క్రమంలో భారత్ లో చొరబడటానికి చేస్తోన్న మానవ ప్రయత్నాలన్నీ వృధా అవుతున్న నేపథ్యంలో.. డ్రోన్ల ద్వారా ఆయుధాలను చేరవేయానికి కుట్ర పన్నిందనే అనుమానాలకు బలం కలిగిస్తోంది ఈ తాజా ఉదంతం. ఇప్పటికే భారత్ లో నిద్రాణంగా (స్లీపర్ సెల్స్) ఉన్న తీవ్రవాదులకు వాటిని చేరవేయడానికి ప్రయత్నిస్తోంది. ఏకే-47 సహా కొన్ని గ్రెనేడ్లు, మరి కొన్ని తుపాకులను ఇదే తరహాలో జార విడిచినట్లు పంజాబ్ పోలీసులు గుర్తించారు. పంజాబ్ లేదా పొరుగు రాష్ట్రాల్లో 26/11 ముంబై తరహా దాడులను సృష్టించడానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రకు పాకిస్తాన్ సహకరిస్తోందంటూ ఇదివరకే వార్తలు వచ్చాయి.
10 కేజీల పేలోడ్ మోయగల డ్రోన్..
పాకిస్తాన్ భూభాగం నుంచి డ్రోన్ల సహాయంతో ఎనిమిది రోజులుగా పెద్ద ఎత్తున మారణాయుధాలు సరఫరా అవుతున్నట్లు తర్న్ తరన్ పోలీసులు గతంలో గుర్తించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ సరిహద్దులు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ పట్టణం. భారీ సామాగ్రిని తరలించడానికి ఉపయోగించే డ్రోన్లు ఎనిమిది రోజులుగా క్రమం తప్పకుండా సరిహద్దుల్లో చక్కర్లు కొడుతున్నాయనే విషయాన్ని కొందరు స్థానికులు పోలీసులకు తెలియజేశారు. ఈ డ్రోన్లు 10 కేజీల పేలోడ్ ను మోయగలవని అన్నారు. దీనిపై తర్న్ తరన్ పోలీసులు సరిహద్దు భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు
ఖకియస్తాన్ ఫోర్స్ కు ఆయుధాలు చేరవేత..
ఇదే క్రమంలో మరోసారి సరిహద్దును దాటుకుని భారత గగనతలంపైకి చొచ్చుకు వచ్చిన డ్రోన్ ను పడగొట్టారు జవాన్లు. దీనిపై పాకిస్తాన్ కు సంబంధించిన కొన్ని గుర్తులు, సంకేతాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ గుర్తులు పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ఉగ్రవాద సంస్థ ఖకియస్తాన్ జిందాబాద్ ఫోర్స్ (కేజెడ్ఎఫ్)కు చెందినవిగా అనుమానిస్తున్నారు. ఇదే సంస్థకు చెందిన నలుగురిని తర్న్ తరన్ పోలీసులు కొద్దిరోజుల కిందట అరెస్టు చేశారు. ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ నుంచి తమకు సహకారం అందుతున్నట్లు ఖకియస్తాన్ జిందాబాద్ ఫోర్స్ కు చెందిన తీవ్రవాదులు వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు.