గుజరాత్ సరిహద్దుల్లో కలకలం..భారత గగనతలంపై పాక్ డ్రోన్..
Recommended Video
భుజ్: గుజరాత్ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం ఉదయం కలకలం చెలరేగింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న గ్రామాలపై పాకిస్తాన్ సైన్యానికి చెందిన డ్రోన్ ఒకటి చక్కర్లు కొట్టింది. సుమారు అరగంట పాటు భారత గగనతలంలో అది తిరుగాడింది. సరిహద్దులకు సమీపంలో ఉన్న మూడు గ్రామల ప్రజలకు ఈ డ్రోన్ కనిపించింది. దీనితో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ డ్రోన్ ను గుర్తించిన కొద్దిసేపటికే సరిహద్దు భద్రతా బలగాలు దాన్ని ధ్వంసం చేశాయి.
గుజరాత్ లో భారత్-పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న కఛ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని అబ్దాసా తాలూకా నాన్ఘతాద్ గ్రామ శివార్లలో ఈ ఉదయం పాకిస్తాన్ సైన్యానికి చెందినట్లుగా భావిస్తున్న ఈ డ్రోన్ భారత గగనతలంలోకి ప్రవేశించింది. దీన్ని గమనించిన వెంటనే అప్రమత్తమైన సరిహద్దు భద్రతా బలగాలు దాన్ని ధ్వంసం చేశాయి. ఈ డ్రోన్ ఎలా వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సైనికాధికారులు తెలిపారు.