అద్భుతం చేశారు, కానీ: మోడీకి పాక్ బాలిక లేఖ, ఏం చెప్పిందంటే..?
ఉత్తర్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చరిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో ఓ పాకిస్థానీ బాలిక.. ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది. పాకిస్థాన్కి చెందిన అకీదత్ నవీద్ అనే 11 ఏళ్ల బాల
ఇస్లామాబాద్: ఉత్తర్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చరిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో ఓ పాకిస్థానీ బాలిక.. ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది. పాకిస్థాన్కి చెందిన అకీదత్ నవీద్ అనే 11 ఏళ్ల బాలిక ఆ లేఖలో మోడీకి శుభాకాంక్షలు తెలిపింది.
అద్భుతం చేశారు..
బీజేపీ అద్భుత విజయంపై అభినందనలు తెలియజేసిన పాకిస్థానీ బాలిక, ఇదే మాదిరి మరింత మంది భారతీయుల, పాకిస్థానీ హృదయాలను గెలుచుకోవాలని సూచించింది. ఇరు దేశాల మధ్య శాంతి సంబంధాలు నెలకొల్పాలని పేర్కొంది. తన లేఖలో అకిదత్ నవీద్.. భారత్, పాక్ల మధ్య శాంతి అవసరమనే సందేశాన్ని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి సాయపడాలని కోరింది.
శాంతిని కోరుకుందాం..
‘ఓసారి మా నాన్న చెప్పారు.. ప్రజల హృదయాన్ని గెలుచుకోవడం ఓ అద్భుతమైన విషయం అని. బహుశా మీరు భారత ప్రజల మనసు గెలిచినందుకే యూపీ ఎన్నికల్లో విజయం సాధించారేమో. కానీ మీకో విషయం చెప్పాలి. మీరు ఇంకా ఎందరో భారతీయ, పాకిస్థాన్ ప్రజల మనసు గెలవాలంటే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండేలా చూసుకోవాలి. ఇక నుంచి బుల్లెట్లకు బదులు పుస్తకాలు, తుపాకులకు బదులు పేదల కోసం మందులు కొనాలి అన్న నినాదాన్ని పాటిద్దాం' అని లేఖలో పేర్కొంది అకీదత్.
అభినందనలు
శాంతినా.. సమస్యనా ఏది ఎంచుకోవాలో ఛాయిస్ మనదేనంటూ మోడీకి రాసిన లేఖలో అకీదత్ తెలిపింది. యూపీ ఎన్నికల్లో అద్భుతం విజయానికి అభినందనలు తెలుపుతూ తన సందేశాన్ని ముగించింది. లాహోర్కు చెందిన ఈ బాలిక.. అంతకుముందు కూడా విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు లేఖ రాసింది. ఆ లేఖలో కూడా ఇరుదేశాల మధ్య శాంతి సంబంధాలు మెరుగుపడాలని కోరింది.
మోడీ స్పందించే అవకాశం..
ఇప్పుడు అకీదత్ రాసిన ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్లాగా మారింది. ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి వెళితే.. ఆయన తప్పక స్పందించే అవకాశం ఉంది.