పాక్కు ఎదురుదెబ్బ : భారత గగనతలంలో పాక్ యుద్ధ విమానాలు...కూల్చేసిన భారత్
ఢిల్లీ: మరోసారి పాకిస్తాన్ తన వక్ర బుద్ధి బయటపెట్టింది. బుధవారం భారత్ గగనతలంలోకి ప్రవేశించి దాడులకు ప్రయత్నించింది. అయితే భారత్ తిప్పి కొట్టడంతో పాక్ యుద్ధ విమానాలు తోకముడిచినట్టుగా సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిలో ఒక పాక్ యుద్ధ విమానం కూలినట్లు తెలుస్తోంది. జెట్ కూలకముందే యుద్ధ విమానంలోని పైలట్ తప్పించుకున్నట్లు సమాచారం. పాక్ సరిహద్దులోనే 3 కిలోమీటర్ల అవతల పాక్ యుద్ధ విమానం కూలినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రపంచదేశాలు చెబుతున్నప్పటికీ పాక్ బుద్ధి మాత్రం మారలేదని చెప్పేందుకు బుధవారం జరిగిన ఘటనే నిదర్శనం . మంగళవారం పాకిస్తాన్ గగనతలంలోకి భారత యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లి దాడిచేసిన నేపథ్యంలో పాకిస్తాన్ బుధవారం ఉదయం సరిహద్దు రేఖ ఉల్లంఘించి భారత గగనతలంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత వాయుసేన అధికారులు వెల్లడించారు. జమ్ము కశ్మీర్లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్లోకి పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించినట్లు సమాచారం.
పాక్ యుద్ధ విమానాలను భారత గగనతలంలో గుర్తించిన వెంటనే భారత వాయుసేన కౌంటర్ ఆపరేషన్ మొదలు పెట్టడంతో తోకముడిచి పాక్లోకి వెళ్లిపోయాయి. ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు దాడులకు పాకిస్తాన్ ఎఫ్ 16-ఎస్ యుద్ధ విమానాలను వినియోగించినట్లు సమాచారం. మూడు యుద్ధ విమానాలు నౌషేరా సెక్టార్ గగనతలంలోకి ప్రవేశించినట్లు భారత్ గుర్తించింది. నౌషేరా గగనతలంలో పాక్ యుద్ధ విమానాలను గుర్తించిన వెంటనే గగనతలంలో ప్యాట్రోలింగ్ నిర్వహిస్తున్న భారత యుద్ద విమానాలు రియాక్ట్ అవడంతో పాక్ యుద్ధ విమానాలు వెనుదిరిగినట్లు ఓ అధికారి వెల్లడించారు.
ఇదిలా ఉంటే భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చంఢీగఢ్, జమ్ముకశ్మీర్లోని పలు విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పలు విమానాలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో, స్పైస్ జెట్ విమానాయాన సంస్థలు ప్రకటించాయి. పలు విమానాలను దారి మళ్లించాయి.