హర్యానాలో పాకిస్తాన్ జాతీయుడు: తొమ్మిది సరిహద్దులు దాటినట్లు నిర్ధారణ
చండీగఢ్: హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ పాకిస్తాన్ జాతీయుడు తిష్ట వేసిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అతని పేరు అలీ ముర్తాజా. పాకిస్తాన్ జాతీయుడు. తొమ్మిది సార్లు అతను అక్రమంగా సరిహద్దులను దాటుకుని పాకిస్తాన్ కు వెళ్లొచ్చినట్లు జిల్లా పోలీసులు గుర్తించారు.
ముర్తాజాను అరెస్టు చేసి, జిల్లా న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అతణ్ని 14 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తున్నట్లు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ముర్తాజా నుంచి భారత్ కు చెందిన మూడు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అభిషేక్ జొర్వాల్ తెలిపారు.అందులో రెండు సిమ్ లు యాక్టివ్ లో ఉన్నాయని అన్నారు.
తొమ్మిది సార్లు అక్రమంగా సరిహద్దులను దాటుకుని పాకిస్తాన్ కు వెళ్లాడని, అంబాలా కంటోన్మెంట్ ప్రాంతానికి సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని పాకిస్తాన్ సైనికాధికారులకు అందజేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని అభిషేక్ వెల్లడించారు. దీనితో అతను పాకిస్తాన్ ప్రోత్సాహిత్ ఐఎస్ఐ ఏజెంట్ లేదా గూఢచారిగా అనుమానిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ముర్తాజా పోలీసుల కస్టడీలో ఉన్నాడని, విచారణ సందర్భంగా మరింత సమాచారాన్ని రాబట్టుకోగలమని చెప్పారు.