పాక్ గూఢచారి అరెస్ట్, 2సిమ్లు సీజ్: చిక్కిన ఇద్దరు ఉగ్రవాదులు
శ్రీనగర్: పాకిస్థాన్కు చెందిన ఓ గూఢచారిని భారత భద్రతా బలగాలు జమ్మూకాశ్మీర్లోని సాంబా సెక్టార్లో అదుపులోకి తీసుకున్నాయి. అతడి వద్ద నుంచి రెండు పాకిస్థానీ సిమ్ కార్డులు, కొన్ని చిత్రపటాల(మ్యాపుల)ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసుల అదుపులోని వ్యక్తి జమ్మూలోని అర్నియా ప్రాంతంలో నివాసముండే బోధ్రాజ్గా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అతడ్ని విచారిస్తున్నారు. ఆగస్టు నెలలో పాక్కు చెందిన ఓ గూఢచారిని రాజస్థాన్లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
అతడి వద్ద సరిహద్దు ప్రాంతాలకు చెందిన మ్యాపులు, చిత్రపటాలను స్వాధీనం చేసుకున్నారు.హిరానగర్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడిన మరుసటి రోజే గూఢాచారిని సిబ్బంది అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
పాకిస్థాన్ కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఇద్దర్ని భారత భద్రతాదళాలు అరెస్ట్ చేశాయి. బారాముల్లా జిల్లాలో వీరిని అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి ఒక ఏకే47, ఓ పిస్టల్ తో పాటు భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కాగా, గడిచిని 36గంటల్లో పాకిస్థాన్ సైన్యం ఆరుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. శుక్రవారం పాక్ సైన్యం కాల్పుల్లో మన జవాను గాయపడగా, మన భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్కు చెందిన ఏడుగురు సైనికులు హతమయ్యారు. కాల్పుల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రతాదళాలు ప్రజలకు సూచించాయి.