కాంగ్రెస్ పార్టీకి ఝలక్.. ఆ స్థానం పోయిందిగా.. 54 ఏళ్లలో ఈసారి సీటు గోవిందా..!
కొట్టాయం : కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలింది. ఉప ఎన్నికలో బొక్కా బొర్లా పడింది. పల అసెంబ్లీ సెగ్మెంట్కు జరిగిన బై పోల్స్లో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఓటర్లు. 11 టర్ముల్లో అంటే 54 ఏళ్లలో తొలిసారిగా పరాజయం చవి చూసినట్లైంది కాంగ్రెస్ పార్టీ. ఊహించని పరిణామంతో ఆ పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుంచి గెలుపు తమదే అంటూ ఆత్మ విశ్వాసం వ్యక్తం చేసిన హస్తం క్యాడర్ చివరకు ఢీలా పడింది.
పల అసెంబ్లీ స్థానం నుంచి 54 సంవత్సరాలుగా గెలుపే తప్ప ఓటమి చవి చూడని కాంగ్రెస్ పార్టీకి ఈసారి షాక్ కొట్టినంత పనైంది. 54 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓటమి చవి చూసింది. యూడీఎఫ్ అభ్యర్థిపై అధికార లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి విజయ బావుటా ఎగుర వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలోకి దిగిన జోస్ టామ్పై లెఫ్ట్ పార్టీ తరపున పోటీ చేసిన మణి కప్పన్ విజయం సాధించారు.
గులాబీ ఎమ్మెల్యేలకు సొంత గూటిలో విలువ లేదంటూ.. టీఆర్ఎస్ పార్టీపై కోమటిరెడ్డి గరం..!
కాంగ్రెస్ అభ్యర్థి జోస్ టామ్కు 51 వేల 194 ఓట్లు రాగా.. లెఫ్ట్ పార్టీ అభ్యర్థి మణి కప్పన్ 54 వేల 137 ఓట్లు సాధించారు. ఈ లెక్కన కాంగ్రెస్ అభ్యర్థిపై 2 వేల 943 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు మణి కప్పన్. బీజేపీ అభ్యర్థి హరికి మాత్రం కేవలం 18 వందల 4 ఓట్లు పోల్ కావడం గమనార్హం. అదలావుంటే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 20 స్థానాల్లో కేవలం ఒకే ఒక్క స్థానం కైవసం చేసుకుని ఢీలా పడ్డ లెఫ్ట్ పార్టీ శ్రేణుల్లో పల అసెంబ్లీ ఉప ఎన్నికల విజయం కొంత జోష్ నింపినట్లైంది.
ఇదివరకు ఉన్న పల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏప్రిల్ నెలలో చనిపోవడంతో ఇక్కడ బై పోల్స్ వచ్చాయి. ఈ నెల 23వ తేదీన పల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమికి అంతర్గత కుమ్ములాటలే కారణంగా తెలుస్తోంది. మొత్తానికి లెఫ్ట్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.