జయ మృతిపై సందేహాలు: స్పందించిన పళని, ఏమన్నారు?
జయలలిత మృతిపై వ్యక్తమవుతున్న సందేహాలపై తమిళనాడు సిఎం పళనిస్వామి స్పందించారు. ఆయన అనుమానాలపై ఇలా అన్నారు...
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై వ్యక్తమవుతున్న సందేహాలపై ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడారు. అమ్మ జయలలిత మరణం విషయంలో ఏ విధమైన వివాదాలు, రహస్యాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
కొంత మంది వ్యక్తులు జయలలిత మృతిపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నిరుడు డిసెంబర్ 5వ తేదీన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మరణించిన విషయం తెలిసిందే. కరువు వల్ల నష్టపోయిన రైతులకు ఐదు రోజుల్లోగా పరిహారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ నెల 27వ తేదీన తాను ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) వివాదంపై ప్రధాని మోడీని కలిసి చర్చిస్తానని చెప్పారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని మొదటి నుంచీ కోరుతున్నారు. తమిళనాడు అసెంబ్లీలో తన బలపరీక్ష రాజ్యాంగబద్ధంగానే జరిగిందని ఆయన చెప్పారు.
చట్టప్రకారమే సభ సజావుగా సాగిందని ఆయన చెప్పారు. శశికళకు జైలు శిక్ష ఖరారు కాగానే ఆమె విధేయుడైన పళనిస్వామి అన్నాడియంకె శాసనసభా పక్ష నేతగా ఎన్నిక కావడం, ఆ తర్వాత గవర్నర్ విద్యాసాగర రావు ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం, అసెంబ్లీలో బలపరీక్ష అన్నీ వేగంగా జరిగిపోయాయి.