ఏం జరుగుతుందో: ఒక్కటైన పళని వ్యతిరేక వర్గం, పది ఓట్లే కీలకం
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ తెగలేదు. పళనిస్వామి గట్టెక్కుతారా, లేదా అనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఎమ్మెల్యేలు ఏం చేస్తారనేది తెలియడం లేదు.
చెన్నై: కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి శాసనసభలో బలపరీక్షకు సిద్దపడిన స్థితిలో తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీలో శనివారం ఉదయం 11 గంటలకు జరిగే బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంఖ్యాపరంగా పళనిస్వామి వైపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ చివరి క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేమనే పరిస్థితి నెలకొంది.
పళనిస్వామి వర్గం నుంచి అరుణ్ కుమార్ అనే ఎమ్మెల్యే బయటకు వచ్చారు .దీంతో ఆయన బలం 122కు పడిపోయింది. అయితే సమయానికి వారంతా పళనిస్వామికి ఓటు వేస్తారా అనుమానం కారణంగానే ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. శానససభలో బలనిరూపణకు 117 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం.
మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజన్ కూడా పన్నీరు సెల్వం వర్గంలో చేరారు. పది మంది ఎమ్మెల్యేలే కీలకం కానున్నారు. రహస్య ఓటింగ్కు అనుమతి ఇస్తే పళనిస్వామి భవిష్యత్తు ఏమవుతుందనే ఉత్కంఠ కూడా నెలకొంది. పళని స్వామి వర్గం ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడింది.
డిఎంకె నేత స్టాలిన్ ఒక్కసారిగా వ్యూహం మార్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటించారు. దీంతో తమిళ రాజకీయాలు మలుపు తిరిగాయి. డిఎంకెకు 89 మంది శాసనసభ్యులు ఉన్నారు. కాంగ్రెసుకు 8 మంది ఉన్నారు. కాంగ్రెసు కూడా డిఎంకె దారిలో నడిచే అవకాశం ఉంది. ఒక్క సభ్యుడున్న ముస్లింలీగ్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తుంది. పన్నీర్ సెల్వం వైపు పది మంది శాసనసభ్యులున్నారు. ఈ స్థితిలో పళని స్వామి గట్టెక్కడం నల్లేరు మీద నడకేమీ కాదని అనిపిస్తోంది.
కరుణానిధి గైర్హాజర్
డిఎంకె అధినేత కరుణానిధి శాసనసభకు హాజరు కావడం లేదు. అనారోగ్యం కారణంగా ఆయన అసెంబ్లీకి రావడం లేదని డిఎంకె ప్రకటించింది. కాంగ్రెసు 9 గంటలకు సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. ప్రజాభిప్రాయం మేరకు ఓటు వేస్తానని పళని శిబిరం నుంచి బయటకు వచ్చిన అరుణ్ కుమార్ అంటున్నారు.
శుక్రవారం రాత్రి రిసార్ట్ నుంచి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్లిపోయారు. నటరాజన్ పళనికి ఎదురు తిరిగారు. ఈ స్థితిలో పళని స్వామి 117 మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటారా అనేది చూడాల్సే ఉంది.
85 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిసార్టు నుంచి పళనివర్గం ఎమ్మెల్యేలు శాసనసభకు బయలుదేరారు. 35 వాహనాల్లో వారు చేరుకుంటున్నారు.