జయ సమాధి వద్ద పిల్లాడిలా బోరున ఏడ్చేసిన పళనిస్వామి
జయలలిత స్మారకం వద్ద పళనిస్వామి చిన్నపిల్లవాడి మాదిరిగా బోరున ఏడ్చేశారు. ఆమెకు నివాళులు అర్పిస్తూ ఉద్వేగాన్ని నిలువరించుకోలేకపోయారు.
చెన్నై: తమిళనాడు శానససభలో తన బలాన్ని నిరూపించుకున్న ముఖ్యమంత్రి పళనిస్వామి జయలలిత సమాధి వద్ద బోరున విలపించాడు. బలనిరూపణ తర్వాత శనివారంనాడు నేరుగా ఆయన మెరీనా బీచ్లోని అమ్మ స్మారకం వద్దకు వెళ్లారు. జయలలితకు నివాళులు అర్పించారు.
జయలలిత స్మారకం వద్దకు చేరుకున్న వెంటనే ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. చిన్నపిల్లవాడిలా బోరున విలపించారు. ఈ ఘటనను చూసిన ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కంటతడి పెట్టుకున్నారు. పన్నీరు సెల్వం తర్వాత జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పళనిస్వామి గుర్తింపు పొందారు.
జయలలిత అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పన్నీరు సెల్వం, పళనిస్వామి, పళనియప్పన్, వైతిలిలింగమ్, విశ్వనాథన్ జయలలితకు అండగా నిలిచి, పంచపాండవులుగా పేరు తెచ్చుకున్నారు. పళనిస్వామి ఎంజీ రామచంద్రన్ సిద్ధాంత పట్ల ఆకర్షితులై అన్నాడియంకెలో చేరారు.
ఏఐడీఎంకేలో చీలిక వచ్చినప్పుడు జానకి రామచంద్రన్ను వ్యతిరేకిస్తూ జయలలిత వైపు వచ్చారు. 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి రావడానికి పళనిస్వామి సామాజిక వర్గమే ప్రధాన కారణమని అంటారు. జయలలితకు వ్యతిరేకత ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా పళనిస్వామి ప్రచారం పార్టీకి ఎంతగానో ఉపయోగపడింది.
పళనిస్వామి సొంత జిల్లా అయిన సేలంలో మొత్తం 11 నియోజవర్గాలుంటే అందులో 10 నియోజవర్గాల్లో అన్నాడీఎంకేనే 2016 ఎన్నికల్లో విజయం సాధించింది.