ట్విస్ట్: బహిష్కరణపై అధికార ప్రకటన కోసం పన్నీర్ షరతు
అన్నాడిఎంకె సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాల విలీనంపై అన్నాడిఎంకెలో హైడ్రామా ఇంకా కొనసాగుతోంది.
చెన్నై: అన్నాడిఎంకె సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాల విలీనంపై అన్నాడిఎంకెలో హైడ్రామా ఇంకా కొనసాగుతోంది.
అన్నాడిఎంకెలో రెండు గ్రూపులు విలీనం కోసం చర్చలు సాగుతున్నాయి. పార్టీపై శశికళ పట్టు తప్పిపోయింది. పార్టీ నుండి శశికళ కుటుంబాన్ని బహిష్కరించారు.
అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని దినకరన్ కూడ ప్రకటించారు.అయితే పన్నీర్ సెల్వం, పళని స్వామి గ్రూపుల మధ్య విలీనం కోసం ఇంకా చర్చలు పూర్తి కాలేదు.చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
అయితే ఈ రెండు గ్రూపులు విలీనం కావాల్సిన అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. లేకపోతే పార్టీ మరింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు నెలకొన్నాయి.దీంతో ఈ రెండు గ్రూపులు విలీనానికి సంసిద్దతను వ్యక్తం చేస్తున్నాయి.
అన్నాడిఎంకె నుండి శశికళ కుటుంబానాన్ని బహిష్కరిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నారు. పన్నీర్ డిమాండ్ తో పళనిస్వామి గ్రూపు ఇబ్బందుల్లో పడింది.అంతేకాదు జయలలిత మృతిపై విచారణకు ఆదేశించాలని పన్నీర్ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.
చర్చల సమయంలో పళని గ్రూప్ కు చెందిన కొందరు నాయకులు అహాంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని పన్నీర్ గ్రూప్ ఆరోపిస్తోంది.ఈ పద్దతిని మార్చుకోవాలని పన్నీర్ గ్రూప్ కోరుతోంది.ఈ పరిస్థితిని కొనసాగిస్తే పళని గ్రూప్ కే నష్టమనే సంకేతాలను పన్నీర్ గ్రూప్ ఇస్తోంది. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై చర్చలంటూనే అహాంకారధోరణితో మాట్లాడుతున్నారని పన్నీర్ సెల్వం గ్రూప్ ఆరోపిస్తోంది.
తమ డిమాండ్ మేరకు అధికార ప్రకటన వచ్చిన తర్వాతే విలీనమంటూ పార్టీ బాధ్యతలపై చర్చలకు వెళతామని సెల్వం వర్గీయులు మునుస్వామి, సీహెచ్ పాండియన్ షరతు విధించారు.అయితే సీఎం పదవిని తనకే దక్కాలని సెల్వం భావిస్తున్నారు. కాగా సీఎం పదవిని ఇచ్చేది లేదని పళనిస్వామి వర్గం తెగేసి చెబుతోంది.