చిన్నమ్మకు దిమ్మతిరిగే షాక్: ఆదేశాలు లెక్కచేయని పళని.. ఇదీ వ్యూహం!
చిన్నమ్మ ఎప్పటికైనా దినకరన్ ను తన స్థానంలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించే అవకాశం ఉండటంతో.. ఈలోపు ప్రజల్లో మంచి పేరు సంపాదించడంతో పాటు, ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం ద్వారా తన స్థానాన్ని నిలుపుకోవాలని
చెన్నై: తనకు జైలు శిక్ష ఖరారైన అనంతరం గంటల వ్యవధిలో అన్నాడీఎంకె రాజకీయాలను శశికళ ప్రభావితం చేశారు. పళనిస్వామిని శాసనసభా పక్ష నేతగా ఎంపిక చేసి పన్నీర్ ఎత్తులకు చెక్ పెట్టారు. ఆ తర్వాతి పరిణామాల్లో పళనిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టినా.. ఆయన చిన్నమ్మ చేతిలోని రిమోట్ కంట్రోల్ అన్న వాదనలు బలంగా వినిపించాయి.
అమ్మకు పన్నీర్ సెల్వంలా.. చిన్నమ్మకు పళనిస్వామి నమ్మినబంటులా ఉంటారని చాలామంది విశ్లేషిస్తూ వచ్చారు. కానీ ఒక్కసారి అధికార పీఠాన్ని అధిష్టించిన తర్వాత ఎవరి తీరులోనైనా సరే మార్పు వస్తుందనడానికి ఇప్పుడు పళనిస్వామి వ్యవహరశైలే ప్రత్యక్ష ఉదాహరణ. తను చెప్పిందల్లా చేస్తూ.. తన ఆదేశాలను పాటిస్తాడనుకున్న శశికళకు పళనిస్వామి స్వతంత్రంగా వ్యవహరిస్తుండటం మింగుడుపడటం లేదని తెలుస్తోంది.
పార్టీ ఎక్కడ తన గుప్పిట్లో నుంచి జారిపోతుందోనన్న ఉద్దేశంతో.. జైలుకు వెళ్లే రోజే తన మేనల్లుడు దినకరన్ ను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించిన సంగతి తెలిసిందే. ఆయనపై చాలామందిలోను వ్యతిరేకత ఉన్నా.. చిన్నమ్మ నిర్ణయంతో ఎవరూ నోరు మెదపలేదు. అయితే చిన్నమ్మ ద్వారా దినకరన్ వేస్తున్న ఎత్తుగడలకు పళనిస్వామి చెక్ పెడుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మొన్నీమధ్యే శశికళను జైల్లో కలిసిన దినకరన్ కొంతమంది అధికారుల జాబితాను చిన్నమ్మ చేతికిచ్చి వారిని బదిలీ చేయించాల్సిందిగా పళిస్వామిని ఆదేశించాలని కోరారు. దినకరన్ చెప్పినట్లుగానే శశికళ ఆ జాబితాను పళనిస్వామికి పంపించి సదరు అధికారులను బదిలీ చేయాలని వర్తమానం పంపించారు.
ఆ జాబితాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ వంటి నిజాయితీ అధికారిణి పేరు కూడా ఉండటం గమనార్హం. దీంతో చిన్నమ్మ చెప్పినట్లు నడుచుకుంటే ప్రజల్లో మరింత వ్యతిరేకతను మూటగట్టుకోవడం ఖాయమని భావించిన పళనిస్వామి చిన్నమ్మ ఆదేశాలను పక్కనబెట్టేశారు. గిరిజను బదిలీ చేయడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చుకోవడమేనని భావించిన పళనిస్వామి చిన్నమ్మ ఆదేశాలను పట్టించుకోలేదు.
దీంతో తాను చెప్పినట్లు నడుచుకుంటాడనుకున్న పళనిస్వామి ఇలా స్వతంత్రంగా వ్యవహరించడం జైల్లో ఉన్న చిన్నమ్మకు మింగుడుపడటం లేదని తెలుస్తోంది. కాగా, పళనిస్వామికి పార్టీ సీనియర్ నేతలు సెంగొట్టయ్యన్, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైల నుంచి పూర్తి మద్దతు ఉండటంతో.. చిన్నమ్మ ఆదేశాల మేరకు కాకుండా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని, ఇందులో భాగంగా కొన్ని ప్రజాకర్షక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం.
అంతేకాదు పార్టీలో మన్నార్ గుడి మాఫియా ప్రాబల్యం పెరుగుతుండటం పట్ల పళనిస్వామి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారట. చిన్నమ్మ ఎప్పటికైనా దినకరన్ ను తన స్థానంలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించే అవకాశం ఉండటంతో.. ఈలోపు ప్రజల్లో మంచి పేరు సంపాదించడంతో పాటు, ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం ద్వారా తన స్థానాన్ని నిలుపుకోవాలని పళనిస్వామి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా పన్నీర్ ను చిత్తు చేయడానికి చిన్నమ్మ ప్రయోగించిన పళనిస్వామి ఎత్తుగడ తిరిగి తనకే బెడిసికొడుతోందా? అన్న అనుమానాలను మాత్రం తెరపైకి వచ్చేలా చేసింది.