సీఎంకు లేఖ, పమేలా అండర్సన్పై ఆగ్రహం: షాకిచ్చిన ఊమెన్
తిరువనంతపురం: కేరళీయుల సాంప్రదాయ పండుగ త్రిసూర్ పూరమ్ ఉత్సవాల్లో ఏనుగులను ఉపయోగించవద్దన్న ప్రముఖ హాలీవుడ్ నటి పమేలా అండర్సన్ విజ్ఞప్తిని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తోసిపుచ్చారు.
ఏనుగులకు బదులు ఫేక్ వాటిని ఉపయోగించాలని పమేలా లేఖ రాశారు. దీనిని ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ఏనుగులను ఉపయోగించడంలో తప్పులేదని ముఖ్యమంత్రి కార్యాలయం అభిప్రాయపడింది.
కాగా, ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి రాసిన ఈ-మెయిల్లో, ఉత్సవాల్లో ఉపయోగించే ఏనుగులను భారత జంతు రక్షణ సంస్థ(ఏడబ్ల్యూబీఐ)లో నమోదు చేయించాలని, కానీ రానున్న ఉత్సవాలకు సంబంధించి కేరళ ప్రభుత్వం ఎలాంటి నమోదు చేయలేదని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఏడాది త్రిసూర్ పూరమ్ ఉత్సవాల్లో ఏనుగులను ఉపయోగించవద్దని ఆమె కోరారు.
పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) తరపున జంతు సంరక్షణకు పోరాడుతున్న విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ కేరళలో రెండు రోజులు ముందు ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ఈ-మెయిల్ రాశారు.
ప్రతి ఏడాది కేరళలోని త్రిసూర్ పట్టణంలో ఉన్న వడక్కుంతన్ ఆలయంలో పూరమ్ ఉత్సవాలను ఏనుగులతో ఘనంగా నిర్వహిస్తారు. పెటా చట్ట ప్రకారం ఏనుగులను ఫొటోలు తీయడం కూడా నేరమేనని ఆమె ఈ-మెయల్లో పేర్కొన్నారు.
పమేల్ ఆండర్సన్ పైన నెట్లో విమర్శలు
హాలీవుడ్ ముద్దుగుమ్మ పమేలా అండర్సన్ ఈ-మెయిల్ విషయమై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళీయుల సంప్రదాయ పండుగ అని, దానిని గుర్తించాలని చురకలు అంటించారు. త్రిస్సూర్ పూరమ్ మా సంప్రదాయమని, దానిని గౌరవించాలని పమేలాకు సూచించారు. పమేలా ఓసారి కేరళకు వచ్చి ఉత్సవాన్ని తిలకించాలని, అలా చేస్తే మరోసారి ఇలాంటి సూచనలు చేయరని మరో నెటిజన్ పేర్కొన్నారు.