లింకింగ్ కు లంకె పెట్టిన సుప్రీంకోర్టు.. పాన్, ఆధార్ అనుసంధానం తప్పనిసరి..!
ఢిల్లీ : ఐటీ రిటర్న్స్ దాఖలు విషయంలో పాన్ కార్డు, ఆధార్ కార్డు లింకింగ్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 139AA ను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ లేకుండానే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయొచ్చని ఢిల్లీ హైకోర్టు అనుమతిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కేంద్ర ప్రభుత్వం. ఆ మేరకు జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ తో కూడిన ధర్మాసనం పాన్, ఆధార్ అనుసంధానం తప్పనిసరంటూ తీర్పునిచ్చింది.
జయశ్రీ, శ్రేయ సేన్ అనే ఇద్దరికి అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. పాన్, ఆధార్ లింకింగ్ లేకుండానే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చన్నది ఆ తీర్పు సారాంశం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి పాన్, ఆధార్ లింకింగ్ లేకుండా వారిద్దరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ మేరకు ఆ రెండింటికీ లింక్ లేకుండా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయొచ్చని న్యాయస్థానం తీర్పు చెప్పింది.
దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. పాన్, ఆధార్ లింకింగ్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న సమయంలో హైకోర్టు అలా తీర్పు ఇచ్చిందని అభిప్రాయపడింది. అయితే ఐటీ చట్టంలోని సెక్షన్ 139AA ను సమర్థిస్తూ పాన్, ఆధార్ లింకింగ్ తప్పనిసరని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఐటీ రిటర్న్స్ దాఖలుకు పాన్, ఆధార్ లంకె మ్యాండెటరీగా మారింది.