ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే.. పాన్ కార్డులు ఇక పనిచేయవా?
'ఎవరికీ.. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని జూన్ 30తర్వాత పాన్ పనికి రాకుండా పోదు' అని కేంద్ర ప్రత్యక్ష పనుల బోర్డు చైర్మన్ సుశీల్ చంద్రా అన్నారు.
న్యూఢిల్లీ: జూన్ 30వ తేదీ లోగా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో.. ఆలోపు లింక్ చేయని పాన్ కార్డులు చెల్లకుండా పోతాయా? అన్న అనుమానాలు జనంలో నెలకొన్నాయి. అయితే ఆదాపయపు పన్ను శాఖ ఈ ప్రచారాన్ని కొట్టిపారేసింది. ఆధార్ తో లింక్ చేయని పాన్ కార్డులను రద్దు చేయమని తెలిపింది.
'ఎవరికీ.. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని జూన్ 30తర్వాత పాన్ పనికి రాకుండా పోదు' అని కేంద్ర ప్రత్యక్ష పనుల బోర్డు చైర్మన్ సుశీల్ చంద్రా అన్నారు. ఆధార్ తో లింకు లేని పాన్ కార్డులు ఎప్పటి నుంచి పనికిరాకుండా పోతాయో అన్న దానిపై.. ఆ తేదీలను తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.
కాగా, జూల్,2017వరకు ఎవరైతే పాన్ కార్డు కలిగి ఉంటారో, వారంతా సెక్షన్ 139ఏఏ సబ్-సెక్షన్2 ప్రొవిజన్స్ కింద ఆధార్ నెంబర్ ను పాన్ కార్డులకు లింక్ చేసుకోవాలని నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం జూన్ 30వ తేదీని డెడ్ లైన్ గా ప్రకటించడంతో.. ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి.
ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన తేదీలోగా ఆధార్ తో పాన్ లింకప్ చేయకపోతే.. అవి పనికి రావా? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. అలాంటిదేమి లేదని తాజాగా కేంద్ర ప్రత్యక్ష పనుల బోర్డు చైర్మన్ సుశీల్ చంద్రా చెప్పడంతో ఇక ఎలాంటి టెన్షన్ అవసరం లేదంటున్నారు పరిశీలకులు.