మళ్లీ బాంబు పేల్చిన పనామా : జాబితాలో విజయసాయిరెడ్డి వియ్యంకుడు, వివేక్
గుట్టు చప్పుడు కాకుండా.. వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని దేశం దాటించిన నల్ల కుబేరుల జాబితాలో రోజుకో కొత్త పేరు బయటికి వస్తోంది. బాలీవుడ్ సెలబ్రిటీల దగ్గరి నుంచి, బడా పారిశ్రామికవేత్తల వరకు అంతా ఈ జాబితాలో దర్శనమిస్తున్నవారే. పనామా పేపర్స్ దెబ్బకు ఎప్పుడు ఎవరి పేరు బయటపడుతుందేమోనన్న ఆందోళన అటు ఆయా రాజకీయ నేతలకు, సినిమా స్టార్లకు దడ పుట్టిస్తున్నట్టుగా సమాచారం.
నిన్నటికి నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ మోటపర్తి శివరామ వరప్రసాద్ పేరును బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు రాజకీయాల్లో కొనసాగుతున్న కొంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తల పేర్లను కూడా పనామా బయటపెట్టింది.
అందులో ఒకరు వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి వియ్యంకుడు అరబిందో ఫార్మా అధినేత రామ్ ప్రసాద్ రెడ్డి కాగా.. మరొకరు తెలంగాణ రాజకీయ భీష్ముడిగా చెప్పుకునే దివంగత వెంకటస్వామి కుమారుడు జి.వివేక్. రామ్ ప్రసాద్ రెడ్డి 'ఆరెంజ్ గ్లో లిమిటెడ్' పేరిట వర్జిన్ ఐల్యాండ్స్ లో కంపెనీ ఏర్పాటు చేయగా.. మాజీ ఎంపీ వివేక్ తన భార్య సరోజతో కలిసి 'బెలోరోజ్ యూనివర్సల్ లిమిటెడ్' పేరిట కంపెనీని ఏర్పాటు చేసినట్టుగా పనామా పేపర్స్ ఆ వివరాలను బయటపెట్టింది.
ఇదిలా ఉంటే.. తమపై వచ్చిన ఆరోపణల పట్ల రామ్ ప్రసాద్ రెడ్డి, వివేక్ ఇంతవరకు స్పందించలేదు. సన్నిహితుల వద్ద మాత్రం తామేమి అక్రమాలకు పాల్పడలేదని, నిబంధనల మేరకే సదరు కంపెనీల ఏర్పాటు, ఆర్థిక లావాదేవీలు నిర్వహించామని చెప్తున్నట్టుగా తెలుస్తోంది.