రాడియా బాగోతం: పేరు మార్చుకున్నా, ఫేట్ మారలేదు
ముంబై: నీరా రాడియా.... కార్పోరేట్ లాబీయిస్ట్. 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పేరు ఇది. అప్పట్లో ఆమె యూపీఏ ప్రభుత్వంలోని రాజకీయ నేతలు, కార్పోరేట్ లాబీయిస్టులతో జరిపిన టెలిఫోన్ సంభాషణలు లీకవ్వడం దేశ వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపాయి.
రాడియాకు చెందిన వైష్ణవి కమ్యూనికేషన్స్ సంస్ధకు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, రతన్ టాటాకు చెందిన టాటా టెలిసర్వీసెస్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఆమె క్లయింట్లుగా ఉన్నాయి. తమకు అనుకూలురైన వ్యక్తులను కేంద్ర మంత్రివర్గంలో నియమించేలా ఆమె నడిపిన లాబీ వ్యవహారం 'రాడియాగేట్'గా దేశ వ్యాప్తంగా ప్రసిద్ధికి ఎక్కింది.
తాజాగా 'పనామా పేపర్స్' లీక్తో దేశంలోని నల్లకుబేరుల జాబితాలో నీరా రాడియా పేరు కూడా ఉండటంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పనామాకు చెందిన మొస్సాక్ ఫొన్సెకా కంపెనీ పత్రాల్లో ఆమె పేరు కూడా ఉందని తాజాగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రిక వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా పది దేశాల్లో నీరా రాడియాకు అక్రమాస్తులు ఉన్నట్టు ఐటీ దర్యాప్తు సంస్ధలు గుర్తించాయి. ఆమెకు విదేశాల్లో కూడా కంపెనీలు ఉన్నట్టు 'పనామా పేపర్స్' ద్వారా వెలుగులోకి వచ్చింది. క్రోన్ మార్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్ లిమిటెడ్ పేరుతో 1994లో ఓ అంతర్జాతీయ వ్యాపార కంపెనీని రాడియా పేరిట బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)లో ఫొన్సెకా ఏర్పాటు చేసింది.
ఆశ్చర్యపోయే విశేషం ఏమిటంటే 2004 జూన్ వరకు ఈ కంపెనీ పత్రాల్లో నీరా రాడియా సంతకాలు చేసినట్టు పత్రాలు కూడా ఉన్నాయి. ఫొన్సెకా రిజిస్టర్లో క్రోన్ మార్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్ లిమిటెడ్ పేరుతో 2009 నుంచి మార్చి 2012 వరకు రికార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించిన మొత్తం 232 డాక్యుమెంట్లు లీకయ్యాయి.
ఈ డాక్యమెంట్స్లో ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్స్, రాడియా సహా డైరెక్టర్ల పేరిట ఉన్న షేర్ సర్టిఫికెట్లు సైతం కూడా ఉండటం విశేషం. ఈ డాక్యమెంట్లలో రాడియాను బ్రిటిష్ పౌరురాలిగా పేర్కొన్నారు. విషయమేమిటంటే క్రౌన్ మార్ట్ ఇంటర్నేషనల్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఆమె లండన్లో ఓ వ్యాపార సంస్థను ఏర్పాటు చేసింది.
'జనరల్ బిజినెస్' పేరిట లండన్లో ఏర్పాటు చేసిన ఈ కంపెనీల్లో రాడియా కుటుంబసభ్యులు యజమానులుగా ఉండగా, ఆమె ప్రధాన షేర్హోల్డర్గా కొనసాగుతున్నారు. 1992లో ఏర్పాటుచేసిన క్రౌన్ మార్ట్ ఇండియా కంపెనీలో రాడియా తండ్రి ఇక్బాల్ నరైన్ మీనన్కు ఒక శాతం వాటా ఉండగా, 1995లో 100,000 పౌండ్ల అప్పు కారణంగా ఈ కంపెనీ దివాళా తీసినట్టు ప్రకటించారు.
ఈ కంపెనీలో రాడియా కొడుకులు అక్షయ్, ఆకాశ్, కరణ్లు కూడా వాటాదారులుగా ఉన్నారు. కాగా, నీరా రాడియా బ్రిటిష్ పౌరురాలు అన్న విషయం వాస్తవమేనని, ఆమెకు ప్రస్తుతం యూకే పాస్ పోర్టు కూడా ఉందని ఆమె కార్యాలయం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. 1998 నుంచి రాడియా పీఐఓ కార్డు హోల్డర్గా ఉన్నారని పేర్కొంది.
2006లో ఆమెకు బ్రిటిష్ పౌరసత్వం వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే జ్యోతిష్యుల సలహా ప్రకారం నీరా రాడియా ఇటీవలే తన పేరులో ఆంగ్ల అక్షరం 'ఐ'ని అదనంగా చేర్చుకున్నారు. కానీ ఫొన్సెకా పత్రాల్లో మాత్రం ఆమె పేరు (Nira Radia) గతంలో ఉన్న మాదిరిగానే కనిపిస్తోంది.