పనామా పేపర్స్ పార్ట్-2 రిలీజ్, రాజన్ స్పందన
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన 'పనామా పేపర్స్' మరో జాబితా విడుదలైంది. ఈ జాబితాలో ఉన్న భారతీయుల్లో మాజీ క్రికెటర్ అశోక్ మల్హోత్రా, క్రాంప్టన్ గ్రీవ్స్ చైర్మన్ గౌతమ్ థాపర్, మొహ్రాసన్స్ జ్యూయెలర్స్ అధినేత అశ్వనీ కుమార్ తదితరుల పేర్లు ఉన్నాయి.
విదేశాల్లో నల్లధనం దాచుకున్నారని చెబుతూ.. విడుదలైన తొలి జాబితాలో పలువురు దేశాధినేతలు, మాజీ ప్రధానులు, ప్రముఖులు ఉన్నారు. అమితాబ్, ఐశ్వర్య రాయ్ల పేర్లు కూడా ఉన్నాయి. వారిలో అత్యధికులు తమకు నల్లధనంతో సంబంధం లేదని వివరణ ఇచ్చారు. తాజాగా, రెండో జాబితా విడుదల కావడం గమనార్హం.
ఆ జాబితా ప్రకారం... లిస్టులో అశ్వని కుమార్ మెహతా పేరు ఉంది. 1999 నుంచి ఇతని కుటుంబ సభ్యుల పేర్లతో కరీబియన్ దీవులు, బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో 7 ఆఫ్షోర్ సంస్థలు రిజిస్టరై ఉన్నట్లు తేలింది. మెహతా, అతని భార్య, ఇద్దరు కుమారుల పేరుమీదే కాకుండా కోడళ్లను డైరెక్టర్లుగా పేర్కొన్నట్లు మొసాక్ ఫొన్సెకా పత్రాల్లో వెల్లడైంది. అయితే, మా పెట్టుబడులన్నింటినీ ఐటీ రిటర్నులో పేర్కొన్నామని చెప్పారు.
జాబితాలో గౌతమ్, కరణ్ థాపర్ పేర్లు ఉన్నాయి. పనామా పేపర్స్ ప్రకారం... క్రాంప్టన్ గ్రీవ్స్ సంస్థకు చెందిన వీళ్లకు పనామాలో చార్ల్వుడ్.. నికామ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్లు ఉన్నాయి. 2005 జులైలో చార్ల్వుడ్ ఫౌండేషన్ను 10వేల అమెరికన్ డాలర్లతో ప్రారంభించినట్లు పత్రాల్లో తేలింది. అదే ఏడాది అక్టోబర్లో నికామ్ ఇంటర్నేషనల్ను కూడా స్థాపించారు. అలాంటి ఫౌండేషన్ ఏదీ ప్రారంభించలేదని థాపర్ చెప్పారు.
సతీష్ గోవింద్ సాంతాని, విష్లావ్ బహదూర్, హరీష్ మొహ్నానీల పేర్లు ఉన్నాయి. పనామా పేపర్స్ ప్రకారం. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో రెండు సంస్థలకు ఈ ముగ్గురు డైరెక్టర్లుగా ఉన్నారు. 2008 డిసెంబర్ 4న డిజైన్ అండ్ క్వాలిటీ లిమిటెడ్, 2007 నవంబర్లో త్రిలియాన్ లిమిటెడ్ అనే ఆఫ్షోర్ కంపెనీలను ప్రారంభించారు. చైనా నుంచి దుస్తులు, ఇతర సరుకులు తెచ్చేందుకు ఆ సంస్థలు స్థాపించామని, ఆ తర్వాత దాన్ని మూసేశామని చెబుతున్నారు.
పనామా పేపర్స్ జాబితాలో గౌతమ్ సీంగల్ పేరు ఉంది. 400 మిలియన్ డాలర్ల ప్రైవేటు ఈక్విటీ ఫండ్తో లింకప్ ఉన్నట్లు తేలింది. అతని పేరుతోనే మరో రెండు ఆఫ్షోర్ సంస్థలు కూడా రిజిస్టరై ఉన్నాయి. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో ఐమీడియా వెంచర్స్ లిమిటెడ్ను 2006లో ప్రారంభించాడు. దాన్ని 2009 నవంబర్లో జెఫ్ మోర్గాన్ క్యాపిటల్ లిమిటెడ్గా పేరు మార్చారు. తనకు ఆఫ్ షోర్ సంస్థలతో సంబంధం లేదని వివరణ ఇచ్చారు.
మధ్యప్రదేశ్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ప్రకాశ్ సంఖ్లా పేరు ఉంది. ఈయనకు పనామాలో లోటస్ హారిజాన్ ఎస్ఏ అనే సంస్థ ఉంది. అందులో ఆయన కుమార్తెలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసంది. తనకు ఆ సంస్థల్లో పెట్టుబడులు లేవని ప్రకాశ్ సంగ్లా వివరణ ఇచ్చాడు.
వినోద్ రాంచంద్ర జాదవ్ పేరు కూడా ఉంది. పనామా పేపర్స్ ప్రకారం.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో పలు సంస్థలున్నాయి. పుణెలోని సవా హెల్త్కేర్ సంస్థకు ఛైర్మన్గా వ్యవహరిస్తున్న వినోద్.. పలు ఆఫ్షోర్ కంపెనీల్లో షేర్ హోల్డర్గా డైరెక్టరుగా ఉన్నారు. వాటిల్లో 2010 నుంచి 2015 మధ్యలో స్థాపించినవే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. తాము ఇప్పటి వరకు ఏ వివరాలను రహస్యంగా ఉంచలేదని వినోద్ చెప్పారు.
పనామా పేపర్స్ ప్రకారం... అశోక్ మల్హోత్రా.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లోని ఈ అండ్ పీ ఆన్లుకర్స్ లిమిటెడ్ సంస్థకు షేర్ హోల్డర్గా, డైరెక్టర్గా ఉన్నారు. 2008 సెప్టెంబర్ 25న ఈ సంస్థను స్థాపించారు. అది చాలా ఏళ్ల క్రితం జరిగిందని, అప్పుడే షేర్లన్నీ అమ్మేశామని అశోక్ చెప్పారు.
పనామా పేపర్స్ ప్రకారం... రంజీవ్ దహుజా, కపిల్ సైన్ గోయల్లు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో ఉన్న బీల్స్ ఇంటర్నేషనల్ కార్ప్ సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నారు. 2012 జూన్లో ప్రారంభించిన ఈ కంపెనీలో వీళ్లు 5000 షేర్లు కలిగి ఉన్నారు. తాము ఈ కంపెనీని కొన్నేళ్ల క్రితం స్థాపించామని, కానీ ఇప్పటి వరకు ఒక్క పని చేయలేదని, కొందరు తప్పుదారి పట్టించడం వల్లే ఆ కంపెనీని స్థాపించాల్సి వచ్చిందని చెప్పారు.
పనామా పేపర్స్ ప్రకారం... వివేక్ జైన్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లోని 'సాక్వినవ్ గ్లోబల్ ఎస్ఏ' కు డైరెక్టర్గా, హాంకాంగ్లో ఉన్న రేడియంట్ వరల్డ్ హోల్డింగ్స్లో షేర్లు కలిగి ఉన్నారు. ఈ కంపెనీలు ఉన్నట్లే తనకు ఐడియా లేదని, నా పేరు, అడ్రస్తో రిజిస్టర్ అయి ఉంటే తనకు తెలిసేదని జైన్ తెలిపారు.
సంవత్సరంలో రూ.1.60 కోట్లు పంపొచ్చు: రఘురామ్ రాజన్
ప్రతి భారతీయుడు చట్టబద్ధంగా ఒక సంవత్సరం కాల వ్యవధిలో సుమారు రూ.1.60 కోట్లు విదేశాలకు పంపించవచ్చని రఘురామ్ రాజన్ చెప్పారు. పనామా పేపర్స్ నేపథ్యంలో.. అది వెల్లడించిన 500 మందిలో ఎందరు చట్టవిరుద్ధంగా నియమిత మొత్తాలకు మించిన పెట్టుబడులు పెట్టానే విషయమై విచారణలే తేలుతుందన్నారు.