భర్త తండ్రి రేప్ చేశాడని ఫిర్యాదు: కోడలు ముక్కు కోయాలని తీర్పు!
జైపూర్: తనపై అత్యాచారయత్నం చేసిన దుర్మార్గుడిని పోలీసులకు పట్టించినందుకు కుల పంచాయతీ ఆమె ముక్కు కోసేయాలని తీర్మానించింది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. రేప్ యత్నం చేసిన వ్యక్తిని పోలీసులకు పట్టించినందుకు శిక్ష విధించాలని కుల పంచాయతీ తీర్పు చెప్పడం గమనార్హం.
ఉత్తరాదిన కుల పంచాయతీ తీర్పులు ఉన్న విషయం తెలిసిందే. తాజా ఈ కుల పంచాయతి తీర్పు నేపథ్యంలో బాధితురాలు డీఎస్పీని ఆశ్రయించింది. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్లోని బార్మర్ గ్రామంలో ఇది జరిగింది.
గ్రామానికి చెందిన ఓ దళిత మహిళ తన భర్త తండ్రి పెళ్లైన కొద్ది రోజుల తర్వాత నుండి తన పైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, ఇటీవల సెప్టెంబరులో అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టారు.
అతనిని రిమాండుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కొంతకాలానికి బెయిల్పై విడుదలైన నిందితుడు గ్రామంలోని కుల పెద్దలను ఆశ్రయించి బాధితురాలిపై పంచాయతి పెట్టించాడు. సదరు పంచాయతిలో పెద్దలు బాధితురాలి ముక్కు కోసేయాలని తీర్పునిచ్చారు.