సీజేఐపై ఆరోపణల విచారణ ఆపండి...త్రిసభ్య కమిటీకి ఎన్జీఓల బహిరంగ లేఖ
ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసు రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. తాజాగా ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన కమిటీ విచారణ నిలిపివేయాలని పలువురు లాయర్లు, సామాజికవేత్తలు, ఎన్జీఓలు డిమాండ్ చేశారు. ఈ మేరకు దాదాపు 300 మంది సంతకాలు చేసిన బహిరంగ లేఖను త్రిసభ్య కమిటీకి పంపారు. ఈ విషయంలో కమిటీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సుప్రీం త్రిసభ్య కమిటీ ఎదుట హాజరైన సీజేఐ
విచారణ తీరుపై అభ్యంతరం
సీజేఐపై ఆరోపణల కేసులో విచారణ జరుగుతున్న తీరుపై లాయర్లు, యాక్టివిస్టులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో త్రిసభ్య కమిటీ చట్టబద్దత కోల్పోయిందని ఆరోపించారు. ఆరోపణలు చేసిన మహిళ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఎక్స్ పార్టీ మ్యాటర్గా దర్యాప్తు జరపాలన్న కమిటీ నిర్ణయాన్ని న్యాయవాదులు తప్పుబడుతున్నారు. ఇది సహజ న్యాయానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.
చట్ట ఉల్లంఘన
త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతున్న తీరుపై లాయర్లు, యాక్టివిస్టులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోపణలు చేసిన మహిళకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. కమిటీ మహిళ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా 2013 చట్టాన్ని, విశాఖ గైడ్లైన్స్ ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. 1997లో జారీ చేసిన ఉత్తర్వులను స్వయంగా సుప్రీంకోర్టే పాటించడంలేదన్న విషయాన్ని లేఖలో పేర్కొన్నారు.
ఇన్హౌస్ ఎంక్వైరీపై అభ్యంతరం
త్రిసభ్య కమిటీ చేస్తున్న ఇన్హౌస్ ఎంక్వైరీ పలు అనుమానాలకు తావిస్తోందని న్యాయవాదులు అంటున్నారు. ఫిర్యాదు చేసిన మహిళ తరఫు లాయర్ను కూడా విచారణకు అనుమతించక పోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కమిటీ ఉద్దేశాలపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోందన్న విషయాన్ని లెటర్లో ప్రస్తావించారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని, అప్పటి వరకు విచారణను ఆపాలని అభ్యర్థించారు. ఈ మేరకు విచారణ కమిటీకి లేఖలో కొన్ని సూచనలు చేశారు.