ప్యాంగాంగ్ సరస్సు నుంచి రేపటి కల్లా బలగాల ఉపసంహరణ- మనకంటే వేగంగా చైనా వెనక్కి
భారత్-చైనా మధ్య కుదిరిన బలగాల ఉపసంహరణ ఒప్పందం ప్రకారం ఇరుదేశాల సైన్యం, యుద్ద ట్యాంకులు వెనక్కి మళ్లుతున్నాయి. ఈ విషయంలో భారత్ కంటే చైనానే ముందున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గతేడాది తాము ఈ ప్రాంతంలో నిర్మించిన హెలిప్యాడ్లు, జెట్టీలను చైనా తొలగించింది. అదే సమయంలో తమ బలగాలు, యుద్ధ ట్యాంకులను సైతం చైనా సరిహద్దుల నుంచి తరలిస్తోంది.
తూర్పు లడఖ్లోని ప్యాంగాంగ్ సరస్సు వద్ద నుంచి కేవలం 8 గంటల్లో చైనాకు చెందిన 200 యుద్ధ ట్యాంకులు 100 కిలోమీటర్ల మేర దూరం వెనక్కి వెళ్లినట్లు మన ఆర్మీ వర్గాలు తెలిపాయి. గతేడాది ఏప్రిల్లో భారత్లో ఘర్షణలు మొదలయ్యాక చైనా ప్యాంగాంగ్ సరస్సు వద్ద నున్న ఫింగర్ 4, ఫింగర్ 8 మధ్య భారీగా సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను మోహరించింది. అలాగే హెలిప్యాడ్లను, జెట్టీల, టెంట్లను కూడా నిర్మించింది. ఇప్పుడు వాటన్నింటినీ తొలగించి వెనక్కి పంపుతోంది.
ఫిబ్రవరి 10న చైనాతో కుదిరిన ఒప్పందం మేరకు భారత్ కూడా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేస్తోంది. ఇప్పటికే సైనికులను వెనక్కి రావాలని ఆదేశాలు పంపింది. దీంతో అక్కడ వేసిన టెంట్లతో సహా సైనికులు వెనక్కి మళ్లుతున్నారు. అయితే భారత్ ఫింగర్ 3 వరకూ మాత్రమే ఈ మళ్లింపులు చేపట్టనుంది. భారత బలగాలను 15 నుంచి 20 రోజుల్లో వెనక్కి మళ్లిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు చైనా ఎంత వెనక్కి వెళ్తుందో చూశాక దాన్ని బట్టి భారత్ కూడా అంతే స్ధాయిలో తమ బలగాలు, యుద్ద సామాగ్రిని వెనక్కి రప్పించనుంది.