దాడులు చేయగలం, కేసులు బనాయిస్తాం: మరో వివాదంలో మంత్రి పంకజ
ముంబై: మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అహ్మద్నగర్ జిల్లాలోని ప్రముఖ ఆలయంలో పనిచేసే పూజారి నామ్దేవ్ శాస్త్రి మహరాజ్పై ఆమె బెదిరింపులకు పాల్పడినట్లుగా ఉన్న ఓ ఆడియో క్లిప్ బయటపడింది.
దసరా సందర్భంగా ఆమె ఇస్తానన్న ప్రసంగాన్ని నామ్దేవ్ వ్యతిరేకించారు. దీంతో ఆమె అతడిని బెదిరించింది. నామ్దేవ్ మద్దతు దారులపై దాడులు చేయించి, తప్పుడు కేసులు బనాయించగల సత్తా తన మనుషులకు ఉందని ఆమె హెచ్చరిస్తున్నట్లు ఆ ఆడియో క్లిప్లో ఉంది.
'పండగ వరకు నేనేమి మాట్లాడను. గొడవపడవద్దని మా వాళ్లకు చెప్పాను. నేను మిమ్మల్ని కొనగలను, కానీ ఆ పని చేయదలచుకోవడం లేదు. గతంలో మీరు అడిగినవన్నీ ఇచ్చాను. ప్రభుత్వ పథకానికి చెందిన సొమ్ము మీకిచ్చాను గుర్తుందా? ఇప్పుడు నేను డబ్బు ఇవ్వను.. నామ్దేవ్ శాస్త్రిని ఏం చేయాలన్నది తర్వాత చూస్తాను. ప్రస్తుతం దసరా పండగ జరగాలి. ఆ సమయంలో మా తరఫునుంచి ఏమైనా జరగడం నాకిష్టం లేదు. మేమేమీ చేతకాని వాళ్లం కాదు. పార్లీలో మా మనుషులు ఎవరినైనా దాడి చేయగలరు, తప్పుడు కేసులు పెట్టి వాళ్లను అక్కడినుంచి పారిపోయేలా చేయగలరు' అని ఆమె మాట్లాడినట్లుగా ఆ ఆడియో క్లిప్లో ఉన్నట్లు తెలిసింది.
కాగా, ఈ విషయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడినందుకు ఆమెను వెంటనే పదవి నుంచి తొలగించాలని శాసనమండలి సభ్యుడు, ప్రతిపక్షనేత ధనంజయ్ ముండే డిమాండ్ చేశారు.
ప్రజల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పథకాన్ని ప్రజల్ని కొనుగోలు చేయడానికి వాడుకుని ప్రభుత్వాన్ని మోసం చేశారని ముండే ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.