వదిలిపెట్టను.. కానీ వేటుకు సిద్ధం.. సంచలనం రేపుతున్న పంకజ ముండే వ్యాఖ్యలు
మహారాష్ట్ర బీజేపీ నేత పంకజ ముండే వ్యవహారం బీజేపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఆమె మహారాష్ట్రలోని రాజకీయ పార్టీల అధినాయకత్వంపై నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, ప్రయోజనాల కోసమే తాను పోరాటం చేస్తున్నానని ఆమె అన్నారు. తన తండ్రి, దివంగత నేత గోపినాథ్ ముండే జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆమె ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ర్యాలీలో పంకజ ముండే మాట్లాడుతూ..
బీజేపీని వదిలిపెట్టను
ఇప్పటికిప్పుడు బీజేపీని విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఒకవేళ పార్టీ తనపై ఎలాంటి నిర్ణయాన్ని అయినా స్వేచ్ఛగా తీసుకోవచ్చు. తనను పార్టీలో కొనసాగించాలా? లేక బహిష్కరించాలా అనే పార్టీ నిర్ణయానికే వదిలి వేస్తున్నాం. ఇప్పటికప్పుడు నాకు పార్టీని వదలాననే ఆలోచన లేదు. ఒకవేళ తనను బహిష్కరిస్తే అందుకు సిద్ధంగానే ఉన్నాను అని పంకజ ముండే అన్నారు.
కోర్ కమిటీ భేటికి గైర్హాజరు
ఇక మంగళవారం ముంబైలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి గైర్హాజరు కావడంతో పంకజ ముండే పార్టీని వీడతున్నారనే ఊహగానాలు ఊపందుకొన్నాయి. అంతేకాకుండా ఆమె పార్టీ కోర్ కమిటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాను కోర్ కమిటీ సభ్యురాలిని కాను. ఎప్పుడైతే ప్రజాసామ్యబద్ధంగా బీజేపీ నిర్ణయాలు తీసుకొంటుందో.. అప్పుడే కోర్ కమిటీలో జాయిన్ అవుతాను అని పంకజ ముండే వెల్లడించారు.
ఫడ్నవీస్పై పరోక్ష దాడి
పంకజ ముండే గత ఐదు ఏళ్లుగా గోపినాథ్ ముండే జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి వేడుకలు మాత్రం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. అక్టోబర్ 21న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత బీజేపీకి గుడ్బై చెబుతారనే వార్తలు ఊపందుకొన్నాయి. బీజేపీ నేతలకు తాను గెలువడం ఇష్టం లేదని, అందుకే తనను ఓడించారు అని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
జనవరిలో నిరాహార దీక్ష
జనవరి నుంచి తన భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తానని.. రాష్ట్రా వ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తానని పంకజ ముండే తెలిపారు. ఔరంగాబాద్లో ఒకరోజు నిరాహార దీక్ష చేస్తాను అని ఆమె వెల్లడించారు. తాను ఓ ఒక్కపార్టీకి, వ్యక్తులకు వ్యతిరేకం కాదు. మరట్వాడా సమస్యలను పార్టీ నేతల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను నిరాహార దీక్ష చేస్తున్నాను అని పంకజ ముండే అన్నారు.