పన్నీర్ 'కథ' ముగిసినట్టేనా.. శశికళ శపథానికి మట్టికరిచారా!?
చిన్నమ్మ నమ్మినబంటు పళనిస్వామి చేతుల్లోకి ప్రభుత్వ పగ్గాలు వెళ్లిపోవడంతో పార్టీపై, అటు ప్రభుత్వంపై మన్నార్ గుడి మాఫియా పట్టు బిగించినట్లైంది. దీంతో పన్నీర్ సెల్వం చాప్టర్ ఇక క్లోజ్ అన్న వాదనలు బలంగా వ
చెన్నై: జైలుకు వెళ్లే ముందు తీవ్ర అసహనంతో రగిలిపోయిన అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ అమ్మ సమాధిపై శపథం చేసి మరీ వెళ్లిన సంగతి తెలిసిందే. జైలుకి వెళ్లడం ఖరారైన కొద్దిసేపట్లోనే తన వ్యూహాలతో పార్టీపై, ఎమ్మెల్యేలపై తన పట్టు జారిపోకుండా జాగ్రత్తపడ్డారు.
ఇదే నేపథ్యంలో పళనిస్వామిని తెరపైకి తెచ్చి పన్నీర్ కు చెక్ పెట్టారు.ఆ తర్వాత చిన్మమ్మ జైలుకు వెళ్లడం పళనిస్వామి ప్రమాణస్వీకారం చేయడం పూర్తయిపోయినా.. ఇంతలోనే బలనిరూపణకు సిద్దం కావాల్సి రావడం మరింత ఉత్కంఠను రేకెత్తించింది.
గవర్నర్ 15రోజుల గడువు ఇచ్చినా శనివారమే బలనిరూపణకు సిద్దపడి ఆఖరికి డీఎంకె నేతల గందరగోళం నడుమే పళనిస్వామి విశ్వాస పరీక్షలో నెగ్గడం జరిగిపోయాయి. అయితే నిన్నటివరకు పళనిస్వామి వర్గాన్ని అడ్డుకుని తీరుతామని సవాల్ చేసిన పన్నీర్ సెల్వం అసెంబ్లీలో మాత్రం సైలెంట్ గా కూర్చుండిపోయారు. ఆయనకు మద్దతుగా ఉన్న 11మంది ఎమ్మెల్యేలది కూడా అదే తీరు.
అదే సమయంలో డీఎంకె నేత స్టాలిన్ సహా ఆ పార్టీ నేతలంతా రచ్చ రచ్చ చేశారు. సభలో ఇంత జరుగుతున్నా పన్నీర్ సెల్వం మాత్రం మిన్నకుండిపోయారు తప్పితే సభలో అసలు ఆయన చేసిందేమి లేదు.
ఆయన్ను వెనుక ఉండి ఎవరైనా నడిపించారా? లేక ఆయనే స్వయంగా తిరుగుబాటు చేస్తూ.. అన్నాడీఎంకె రాజకీయాలను ఇక్కడిదాకా లాక్కొచ్చారా? అన్నది పక్కనబెడితే ఆయన మాత్రం రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యారు.
చిన్నమ్మ నమ్మినబంటు పళనిస్వామి చేతుల్లోకి ప్రభుత్వ పగ్గాలు వెళ్లిపోవడంతో పార్టీపై, అటు ప్రభుత్వంపై మన్నార్ గుడి మాఫియా పట్టు బిగించినట్లైంది. దీంతో పన్నీర్ సెల్వం చాప్టర్ ఇక క్లోజ్ అన్న వాదనలు బలంగా వినిపిస్తుండగా.. శపథం చేసి మరీ శశికళ పన్నీర్ ను మట్టికరిపించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే భవిష్యత్తులో అన్నాడీఎంకె రాజకీయాలపై పన్నీర్ ఎంతమేర పోరాడుతారన్న దానిపై ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేంటంటే.. శశికళతో పోరు సాగిన కీలక సమయంలో దాదాపు వారానికి పైగా సమయం చిక్కినా.. ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో రాజకీయంగా ఆయన పేలవ వైఖరి స్పష్టమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు.