మెరీనా బీచ్లో దీక్షకు దిగిన పన్నీర్: తమిళనాట మరో అలజడి..
జయ మృతిపై అనుమానాలు నివృత్తి కావాలంటే సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతున్నారు పన్నీర్ సెల్వం.
చెన్నై: రాజకీయంగా పుంజుకోవడంతో పాటు జయలలితకు తానే వారసున్ని అని చాటుకోవడానికి.. 'జయలలిత మృతి' అంశాన్ని బాగానే వాడుకోవాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మ మృతిపై ఎయిమ్స్ వైద్యులు, ప్రభుత్వం వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఆయన మాత్రం సంతృప్తి చెందలేదు.
జయ మృతిపై అనుమానాలు నివృత్తి కావాలంటే సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతున్నారు పన్నీర్ సెల్వం. ఇదే డిమాండుతో నేటి ఉదయం ఆయన మెరీనా బీచ్ లో దీక్షను ప్రారంభించారు. జయ మృతిపై సీబీఐ విచారణ జరిపించేంతవరకు దీక్ష విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు.
కాగా, పన్నీర్ సెల్వం దీక్షకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. పలువురు మద్దతుదారులు, ప్రజలు దీక్షాస్థలి వద్దకు చేరుకుంటున్నారు. పన్నీర్ తో పాటు జయలలిత మృతి పట్ల అనుమానం వ్యక్తం చేసిన పలువురు నేతలు, గౌతమి లాంటి నటీమణులు ఆయనతో జతకలిసే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం పన్నీర్ సెల్వం దీక్ష ప్రస్తుతం తమిళనాడులో మరో అలజడి రేపే దిశగా సాగుతోంది.