ఎట్టకేలకు.. అమ్మ కుర్చీలో కూర్చున్న పన్నీర్ సెల్వం..
సీఎంగా తొలిసారి కేబినెట్ మీటింగ్ నిర్వహించిన పన్నీర్ సెల్వం.. తొలిసారిగా అమ్మ ఖాళీ చేసిన కుర్చీలో కూర్చున్నారు.
చెన్నై: అమ్మ పట్ల తమిళ ప్రజలే కాదు.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతటి వినయ విధేయతలతో ఉంటారో తెలిసిందే. అమ్మ కనిపించగానే.. పడీ పడీ సాష్టాంగ నమస్కరాలు చేసే పార్టీ వర్గాలు అమ్మకు ఎంత గౌరవమిస్తాయో.. అమ్మ కుర్చీకి కూడా అంతే గౌరవమిస్తాయి.
గతంలో జయలలిత జైలుకు వెళ్లాల్సి వచ్చిన సందర్బంలోను.. ఆ కుర్చీని ఖాళీగా ఉంచారే తప్పితే.. సీఎంగా పన్నీర్ సెల్వం కుర్చీలో కూర్చునే ధైర్యం చేయలేదు. ఈ నేపథ్యంలోనే జయ మరణం తర్వాత తొలిసారి జరిగిన కేబినెట్ భేటీపై అందరి దృష్టి నిలిచింది. అయితే అందరి సందేహాలకు తెరదించుతూ.. ఈ దఫా అమ్మ కుర్చీలో కూర్చున్నారు పన్నీర్ సెల్వం.
గతంలో జయలలిత గైర్హాజరీలోను.. అమ్మ ఫోటోను కుర్చీలో పెట్టి కేబినెట్ మీటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. శనివారం నాటి కేబినెట్ భేటీలోను అమ్మ ఫోటోను ఉంచినా.. ఈ దఫా ఆమె ఖాళీ చేసిన కుర్చీలో పన్నీర్ సెల్వం కూర్చోవడం ఆసక్తిని రేకెత్తించింది.
భేటీలో భాగంగా తొలుత అమ్మకు నివాళులర్పించి.. పలు ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్బంగా మెరీనా బీచ్ లో అమ్మ స్మారక స్థూపాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.