చిన్నమ్మకు పన్నీర్ షాక్: హై-సెక్యూరిటీ తొలగిస్తూ ఆదేశాలు..
సీఎం నుంచి ఉత్తర్వులు జారీ అయిన వెంటనే పోయిస్ గార్డెన్స్ లోని వేదనిలయం నుంచి 80శాతం మంది భద్రతా సిబ్బంది వెళ్లిపోయారు.
చెన్నై: తమిళ దివంగత సీఎం అమ్మ అస్తమయం తర్వాత పార్టీని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు చిన్నమ్మ శశికళ చేస్తూ వచ్చిన ప్రయత్నాలన్ని బెడిసికొడుతున్నాయి. శశికళ ఆధిపత్యానికి సీఎం పన్నీర్ సెల్వం ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారనే చెప్పాలి.
నిన్న మొన్నటిదాకా జయలలిత తరహాలోనే శశికళకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన పన్నీర్ సెల్వం.. ఒక్కసారిగా తన రూట్ మార్చినట్టు తెలుస్తోంది. తాజాగా శశికళకు ఉన్న హై సెక్యూరిటీని తొలగిస్తూ సీఎం పన్నీర్ సెల్వం ఆదేశాలు జారీ చేశారు. జయలలిత బ్రతికున్నప్పటి నుంచి ఆమెతో సమానంగా శశికళకు భద్రతకు కల్పిస్తూ వస్తున్నారు. సోమవారం వరకు అలాగే కొనసాగిన ఈ భద్రత.. తాజా సీఎం ఆదేశాలతో రద్దు కానుంది.
సీఎం నుంచి ఉత్తర్వులు జారీ అయిన వెంటనే పోయెస్ గార్డెన్స్ లోని వేదనిలయం నుంచి 80శాతం మంది భద్రతా సిబ్బంది వెళ్లిపోయారు. ప్రస్తుతం పోయెస్ గార్డెన్ వద్ద కేవలం ఐదుగురు కానిస్టేబుల్స్ మాత్రమే భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు.
మరో ఆసక్తికర విషయమేంటంటే.. అమ్మ మరణం తర్వాత శశికళ వద్దకు క్యూ కట్టిన నేతల సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. జరుగుతున్న పరిణామాలను పరివశిలిస్తే.. పార్టీని, ప్రభుత్వాన్ని శశికళ గుప్పిట్లోకి పోనివ్వకుండా పన్నీర్ సెల్వం జాగ్రత్తపడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.