మోదీ టీంలో పన్నీర్ సెల్వం తనయుడు..!తమిళనాడులో పాగా వేసేందుకు వ్యూహం..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : నరేంద్ర మోదీ కొత్త కేబినెట్లో అన్నాడీఎంకే ఏకైక ఎంపీ, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తనయుడు పి.రవీంద్రనాథ్ కుమార్కు చోటు దక్కనుంది. ఈమేరకు రవీంద్రనాథ్ కుమార్కు అమిత్షా నుంచి ఫోన్ కాల్ అందినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేసినప్పటికీ ప్రతిపక్ష డీఎంకే విజయఢంకా మోగించింది. 39 లోక్సభ స్థానాలకు గాను 38 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించగా, 37 స్థానాల్లో డీఎంకే విజయం సాధించింది. అన్నాడీఎంకే నుంచి రవీంద్రనాథ్ కుమార్ ఒక్కరే గెలుపొందారు.
నరేంద్ర మోదీ నేడు మరి కాసేపట్లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అదే వేడుకలో మరికొంత మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ క్యాబినెట్లో చోటు దక్కే ఎంపీలకు పీఎంవో నుంచి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. ఫోన్ కాల్ అందుకున్నవారిలో పాత క్యాబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. కర్నాటక నేత డీవీ సదానంద గౌడకు పీఎంవో నుంచి పిలుపువచ్చింది. సదానంద గౌడకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. గిరిరాజ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రదాన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, నితిన్ గడ్కరీ, తవార్చంద్ గెహ్లాట్, ఆర్సీపీ సింగ్, నిత్యానంద్ రాయ్, కిరణ్ రిజుజు, సురేశ్ అంగాడీ, ప్రహ్లాద్ జోషి, కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి, పురుషోత్తం రూపాలా, మనుష్క మాండవీయ, నిర్మలా సీతారామన్, రావు ఇంద్రజిత్, రవీంద్రన్, రవిశంకర్ ప్రసాద్, బాబుల్ సుప్రియో, జితేంద్ర సింగ్ తోమర్, అర్జున్ రామ్ మేఘ్వాల్, ప్రకాశ్ జవదేకర్, రాందేస్ అత్వాల్, రాజ్నాథ్ సింగ్లు కూడా కొత్త క్యాబినెట్లో స్థానం దక్కించుకోనున్నారు.