రెండాకులు-విద్యుత్ స్తంభం: పన్నీరు మాస్టర్ ప్లాన్, శశికళ వర్గం చిత్తు
తమిళనాట ఆర్కే నగర్ ఉప ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం వర్గం నుంచి ఈ మధుసూదనన్ బరిలో నిలిచారు. వీరి ఎన్నికల గుర్తు విద్యుత్ స్తంభం.
చెన్నై: తమిళనాట ఆర్కే నగర్ ఉప ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం వర్గం నుంచి ఈ మధుసూదనన్ బరిలో నిలిచారు. వీరి ఎన్నికల గుర్తు విద్యుత్ స్తంభం. శశికళ వర్గం నుంచి దినకరన్ పోటీ చేస్తున్నారు. ఆయన గుర్తు టోపీ.
పన్నీరుసెల్వం క్యాంప్ విద్యుత్ స్తంభం గుర్తును ఉపయోగించే తీరుపై శశికళ వర్గం ఆగ్రహంతో ఉంది. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.
పన్నీరుసెల్వం క్యాంపుకు ఎన్నికల గుర్తు విద్యుత్ స్తంభం రాగా.. వారు దానిని రెండు ఆకుల వలె ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పన్నీరు మాస్టర్ ప్లాన్కు ప్రత్యర్థి పార్టీలు చుక్కలు చూస్తున్నాయి.
పన్నీరుసెల్వం వర్గం ఓ ప్రచార వీడియోను విడుదల చేసింది. అందులో విద్యుత్ స్తంభం ఉంది. విద్యుత్ స్తంభానికి పైన రెండు వైపుల బల్బులు ఉంటాయి. ఇరువైపులా ఆకుపచ్చ రంగులో వెలుగుతాయి. అది చూసేందుకు రెండు ఆకుల వలె ఉంటుంది. ఆ వీడియోలో జయలలిత కనిపిస్తారు.
రెండాకులు.. అన్నాడీఎంకే పార్టీ గుర్తు. శశికళ వర్గం, పన్నీరుసెల్వం వర్గం రగడ నేపథ్యంలో ఈసీ దానిని ప్రస్తుతానికి పక్కన పెట్టింది. ఇరు వర్గాలకు కొత్త గుర్తులు కేటాయించింది. ఇందులో భాగంగా పన్నీరు వర్గానికి విద్యుత్ స్తంభం వచ్చింది.