రూ. 100 కోట్లు ఖర్చుపెట్టాను: ఒక్క రూపాయి రాలేదు: పన్నీర్ అసహనం, ఎందుకంటే!
పన్నీర్ సెల్వం పార్టీ మీద తిరుగుబాటు చేసినప్పటి నుంచి నేటి వరకు దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం.
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఓ విషయంలో అసహనం వ్యక్తం చేస్తున్నారని వెలుగు చూసింది. ప్రతినిత్యం అన్నీ తానే చూసుకుంటున్నా తన వెంట ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు ఆర్థిక విషయాల్లో తనకు ఎలాంటి సహకారం ఇవ్వడం లేదని పన్నీర్ సెల్వం అసహనం వ్యక్తం చేస్తున్నారని వెలుగు చూసింది.
శశికళ మీద తిరుగుబాటు చేసిన తరువాత తాను ఆర్థికంగా చాల నష్టపోయానని ఆయన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం జయలలిత సమాధి దగ్గర రాత్రికి రాత్రి శశికళ మీద తిరుగుబాటు చేశారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని బాంబుపేల్చారు. ఆరోజు నుంచి శశికళ వర్గం మీద పోరాటం చేస్తున్నారు.
పన్నీర్ సెల్వం సీఎం అవుతారని !
శశికళ మీద తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వంకు అన్నాడీఎంకే పార్టీకి చెందిన అనేక మంది సీనియర్ నాయకులు అండగా నిలిచారు. పన్నీర్ సెల్వం వైపు ఎమ్మెల్యేలు అందరూ వస్తారని, ఆయనే సీఎం అవుతారని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు భావించారు.
రిసార్ట్స్ లో సీన్ రివర్స్
అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేతో సమావేశం ఏర్పాటు చేసిన శశికళ గుట్టుచప్పుడు కాకుండా ఎమ్మెల్యేలు అందరినీ కువత్తూరు రిసార్ట్స్ కు తీసుకువెళ్లిపోయారు. అప్పటి నుంచి పన్నీర్ సెల్వం తన వర్గం వైపు ఎమ్మెల్యేలను తిప్పుకోవడానికి నానా ప్రయత్నాలు చేశారు.
11 మంది ఎమ్మెల్యేలు
చివరికి పన్నీర్ సెల్వం 11 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలను తన వర్గం వైపు వచ్చేలా పావులుకదిపారు. అయితే 122 మంది ఎమ్మెల్యేలను మభ్యపెట్టిన మన్నారుగుడి మాఫియా సభ్యులు ఎడప్పాడి పళనిసామికి మద్దతు ఇచ్చేలా పావులుకదిపి సక్సస్ అయ్యారు.
ఆరోజు నుంచి ఆర్థికంగా చితికిపోయిన పన్నీర్ ?
ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నాయకులను తనవైపు తిప్పుకోవడానానికి పన్నీర్ సెల్వం భారీ మొత్తంలోనే ఖర్చుపెట్టారని తెలిసింది. అయినా అధికారం దక్కకపోవడంతో పన్నీర్ సెల్వం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తన వర్గంలోకి వచ్చేటట్లు పావులుకదిపి సక్సస్ అయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిరాహారదీక్ష
మార్చి 8వ తేదీన పన్నీర్ సెల్వం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా శశికళకు వ్యతిరేకంగా నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ఆయన వర్గంలోని నాయకులు జిల్లా కేంద్రాలుగా నిరాహారదీక్ష చేశారు. ఆ సమయంలో అన్నాడీఎంకే కార్యకర్తలను నిరాహారదీక్షా శిభిరాలకు తరలించడానికి పన్నీర్ సెల్వం భారీ మొత్తంలో డబ్బు ఖర్చుపెట్టారని సమాచారం.
కార్యకర్తలకు వంటలు, భోజనాలు
తమిళనాడులోని అన్ని జిల్లాల నుంచి తన ఇంటి దగ్గరకు వస్తున్న కార్యాకర్తలు అందరికీ నెల రోజుల పాటు పన్నీర్ సెల్వం భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో భారీ మొత్తంలో డబ్బు ఖర్చుపెట్టారు. శశికళ మీద తిరుగుబాటు చేసిన తరువాత ఇప్పటి వరకు ఖర్చు మొత్తం తానే పెట్టానని పన్నీర్ సెల్వం తన సన్నిహితుల దగ్గర చెప్పారని తెలిసింది.
రూ. 100 కోట్లకు పైగా ఖర్చు ?
పన్నీర్ సెల్వం పార్టీ మీద తిరుగుబాటు చేసినప్పటి నుంచి నేటి వరకు దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. అయితే తన వెంట ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకలు ఇప్పటి వరకూ ఒక్క రూపాయి ఖర్చుపెట్టకపోవడంతో పన్నీర్ సెల్వం కొంచెం అసహనం వ్యక్తం చేశారని తెలిసింది.
వస్తే రానివ్వండి, లేదంటే లేదు !
అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు విలీనం చర్చలు ఈరోజు రేపు అంటూ కొలిక్కిరాలేదు. అయితే చర్చలు ఎప్పుడు జరిగితే అప్పుడే జరగనివ్వండి, ఇక మీద తాను ఆర్థికంగా తెగించలేనని పన్నీర్ సెల్వం తన సన్నిహితుల దగ్గర వాపోయారని సమాచారం. అయితే ఇప్పటికైనా నాయకులు శశికళ మీద పోరాటం చెయ్యడానికి ఆర్థికంగా సహకరిస్తారో లేదో వేచి చూడాలని పన్నీర్ సెల్వం అంటున్నారని తెలిసింది.
నేటీ నుంచి రాష్ట్ర పర్యటన
శుక్రవారం కాంచీపురంలో పన్నీర్ సెల్వం రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. జూన్ వరకు తమిళనాడులోని అన్ని జిల్లాల్లో పర్యటించి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి చుక్కలు చూపించడానికి సిద్దం అయ్యారు. అందుకు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని బయటకు చెబుతున్న పన్నీర్ సెల్వం లోలోపల ఆందోళన చెందుతున్నారని తెలిసింది.