చరిత్రలో ఇదే ప్రథమం.. పతాక ఆవిష్కరణ చేసిన తొలి సీఎం 'పన్నీర్'
గవర్నర్ కాకుండా సీఎంగా ఉన్న వ్యక్తి పతాక ఆవిష్కరణ చేయడం తమిళనాడు చరిత్రలో ఇదే ప్రథమం.
చెన్నై: తమిళనాడు రాష్ట్రానికి ఇంకా పూర్తి స్థాయి గవర్నర్ ను కేటాయించకపోవడం వల్ల.. రాష్ట్రంలో నిర్వహించిన గణతంత్ర దినోత్స వేడుకల్లో తొలిసారిగా స్వల్ప మార్పు చోటు చేసుకుంది.
గణతంత్ర దినోత్సవం నాడు ఆనవాయితీ ప్రకారం గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాల్సి ఉంటుంది. అయితే తమిళనాడు ఇన్చార్జీ గవర్నర్గా ఉన్న మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబై గణతంత్ర వేడుకల్లో పాల్గొని, తిరిగి తమిళనాడు రావడం ఆలస్యమవుతుందన్న కారణంతో.. సీఎం పన్నీర్ సెల్వం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
పతాకావిష్కరణ కోసం చెన్నై మెరీనా బీచ్ చేరుకున్న సీఎంకు తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు చెన్నై పరిధిలోని త్రివిధ దళాధిపతులను పరిచయం చేశారు. అటు తర్వాత పతాక ఆవిష్కరణ చేసిన పన్నీర్ సెల్వం.. త్రివిధ దళాధిపతుల గౌరవ వందనం స్వీకరించారు.
కాగా, గవర్నర్ కాకుండా సీఎంగా ఉన్న వ్యక్తి పతాక ఆవిష్కరణ చేయడం తమిళనాడు చరిత్రలో ఇదే ప్రథమం. అలాగే ఇప్పటివరకు మూడు దఫాలు సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన పన్నీర్ సెల్వం.. జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం కూడా ఇదే మొదటిసారి.