విలీనాన్నే కోరుకుంటున్న మోడీ, వారిని శిక్షించాల్సిందే: రజినీపై పన్నీరు ఇలా
చెన్నై: అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేలో చీలిపోయిన రెండు వర్గాల విలీనమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్ష అని పన్నీర్సెల్వం అన్నారు. ఒక ఇంగ్షీష్ డెయిలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తమిళ రాజకీయాలపై స్పందించారు.
మోడీ కోరుకుంటున్నది అదే..
ఇటీవల దిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైనట్లు తెలిపిన పన్నీరుసెల్వం.. అన్నాడీఎంకే రెండు వర్గాల విలీనాన్ని ప్రధాన మంత్రి ఆకాంక్షించారని చెప్పారు. సుస్థిర ప్రభుత్వం కొనసాగితేనే ప్రజలకు మంచి పాలన అందివ్వడం సాధ్యమన్నారని తెలిపారు.
తమిళాడులో కూడా అలాగే..
దేశంలో అవినీతి రహిత పాలన అందించడానికి ప్రధాని కృషి చేస్తున్నారని పన్నీరు చెప్పారు. అదే తరహా పాలన తమిళనాడులోనూ అన్నాడీఎంకే ఆధ్వర్యంలో కొనసాగాలని ప్రధాని చెప్పారని అన్నారు.
పళని, శశికళ సిద్ధంగా లేరు
‘విలీన చర్చల కమిటీని రద్దు చేయడానికి అనేక కారణాలున్నాయి. అన్నాడీఎంకే కార్యకర్తలకు చెందిన పార్టీ. ఇందులో పన్నీర్సెల్వం, పళనిస్వామి, శశికళ కుటుంబాలకు చోటు ఉండదు. ఈ ఆశయాలకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. సామరస్య మార్గంలో నిర్మాణాత్మకంగా చర్చలు సాగడానికి పళనిస్వామి వర్గం సిద్ధంగా లేదు. రెండు వర్గాలు ఒక్కటవ్వాలి. తగిన విధంగా పళనిస్వామి వర్గం ముందుకు రావాలి. ఇలా వర్గాలు ఏర్పడినా...ఒక్కరు కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లలేదు. అన్నాడీఎంకే ఎంత బలమైనదో దీన్ని బట్టే తెలుస్తోంది. ప్రజాసేవకు ఎవరైనా రాష్ట్ర రాజకీయాల్లోకి రావచ్చు' అని పన్నీరు సెల్వం వివరించారు.
రజినీ ప్రభావం ఉండదు..
రజనీకాంత్ వచ్చినా తమపై ఏ మాత్రమూ ప్రభావం చూపదని పన్నీరుసెల్వం ధీమా వ్యక్తం చేశారు. కోవత్తూరు రిసార్ట్స్ నుంచి పారిపోయి వచ్చిన ఎమ్మెల్యే శరవణన్ అప్పుడు ఏం చెప్పారో... అవే వీడియోలోనూ ఉన్నాయన్నారు. ముడుపులు తీసుకొని ఓటువేసిన వారిని శిక్షించాలని పన్నీరు డిమాండ్ చేశారు. టీటీవీ దినకరన్ వైపు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నది ఒక నాటకమని, పళనిస్వామికి పాలనా సామర్థ్యం లేదని ప్రజలు భావిస్తున్నారని పన్నీరు సెల్వం తెలిపారు.