సంక్రాంతి స్పెషల్: 67 శాతం ఆర్ టీసీ చార్జీలు పెంచారు, ఆరేళ్లు: మేం తట్టుకోలేం !
చెన్నై: తమిళనాడులో ఆరేళ్ల తరువాత ఆర్ టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. ఒక్కసారిగా ఎవ్వరూ ఊహించని రీతిలో 67 శాతం పెంచిన తమిళనాడు రవాణా శాఖ ప్రజలకు పెద్ద షాకే ఇచ్చింది. ఒక్క రోజుకూడా ఆలస్యం చెయ్యకుండా శనివారం నుంచే పెంచిన ధరలు అమలులోకి వచ్చేశాయి.
వోల్వో నుంచి గ్రామీణ !
మెట్రో నగరాల్లోని బస్సులు, నాన్ మెట్రో నగరాల్లోని బస్సులు, ఎక్స్ ప్రెస్ బస్సులు, ఆర్డీనరీ బస్సులు, గ్రామీణ బస్సుల చార్జీలు పెరిగిపోయాయి. ఇక వోల్వో, ఏసీ బస్సు చార్జీలు బాదేశారు. చార్జీల పెంపుపై తమిళనాడు రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రవాణా శాఖ ఇప్పటికే నష్టాల్లో ఉందని, జీతాలు పెంచాలని రవాణ సంస్థ ఉద్యోగులు చేసిన సమ్మెతో అవి రూ. వందలకోట్ల స్థాయికి చేరుకున్నాయని ప్రభుత్వం చెప్పింది.
హైకోర్టు ఆదేశాలు
తమిళనాడు ఆర్ టీసీ నష్టాల్లో ఉందని, ఇప్పుడు ఆ సంస్థ ఉద్యోగుల జీతాలు పెంచలేమని తమిళనాడు ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. హైకోర్టు ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను అనుసరించి ధరలను పెంచామని తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రకటనలో వివరించింది.
ఆంధ్రా, కర్ణాటక, కేరళ !
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పోలిస్తే ఈ పెంపు చాలా తక్కువేనని, ఈ రాష్ట్రాలు మూడేళ్ల క్రితమే ఆర్ టీసీ బస్సు ఛార్జీలను భారీగా పెంచాయని తమిళనాడు రవాణా శాఖ వివరించింది.
రవాణా వ్యవస్థ ఇప్పటికే నష్టాల్లో ఉండగా జీతాలు పెంచాలని రవాణ సంస్థ ఉద్యోగులు చేసిన సమ్మెతో అవి భారీ స్థాయికి చేరుకున్నాయని ప్రభుత్వం చెప్పింది.
మావల్ల కాదు
రాష్ట్రంలో 8 ప్రభుత్వ రవాణా సంస్థలు, ప్రైవేటు రవాణా సంస్థలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, తప్పని పరిస్థితుల్లోనే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని, మేము నష్టాలు బరించలేకున్నామని తమిళనాడు రవాణా శాఖ వివరణ ఇచ్చుకుంది.
పన్నీర్ సెల్వం మనవి !
ఆర్ టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలని తమిళనాడులో అప్పుడే ఆందోళన మొదలైయ్యింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఆర్ టీసీ బస్సు చార్జీలు తక్కువగానే ఉన్నాయని, ఆందోళన చెయ్యరాదని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రజలకు మనవి చేశారు.