కోవై ఆసుపత్రిలో మాజీ సీఎం పన్నీర్ సెల్వం: మూడు రోజుల తరువాత, పళనిసామికి !
మధుమేహం, కీళ్లనొప్పులు, శ్వాసకోస తదితర సమస్యలకు కోయంబత్తూరులోని ఆయుర్వేదశాలలోనే చికిత్స పొందాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారు. పలు ఆరోగ్య సమస్యలకు పూర్తి చికిత్స తీసుకోవాలంటే మూడు రోజులు అవసరం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు (పురుచ్చి తలైవి అమ్మ) పన్నీర్ సెల్వం కోయంబత్తూరులోని ఆయుర్వేదశాలలో చేరారు. ఆయన మూడు రోజుల పాటు ఇక్కడే చికిత్స పొందుతారని అక్కడి వైద్యులు తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా తన పదవికి రాజీనామా చేసిన తరువాత శశికళ మీద తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం విశ్రాంతి లేకుండా ఆమె వర్గం మీద పోరాటం చేస్తున్నారు. అన్నాడీఎంకేని రెండుగా చీల్చిన పన్నీర్ సెల్వం ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు.
రెండు సార్లు ఢిల్లీ పర్యటన !
తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత పన్నీర్ సెల్వం రెండు సార్లు ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులను కలిశారు. అదే సందర్బంలో ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం చేరుకుని రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని మనవి చేశారు.
అలసిపోయిన పన్నీర్ సెల్వం
విశ్రాంతి లేకుండా నాయకులతో మంతనాలు జరుపుతూ, శశికళ వర్గానికి సినిమా చూపిస్తున్న పన్నీర్ సెల్వం అలసిపోయారని ఆయన వర్గీయులు అంటున్నారు. గత నాలుగు నెలల నుంచి విశ్రాంతిలేకుండా సంచరించడంతో పన్నీర్ సెల్వం అనారోగ్యానికి గురైనారని సమాచారం.
రాష్ట్ర పర్యటలో భాగంగా
మే 5వ తేది నుంచి పన్నీర్ సెల్వం తమిళనాడు రాష్ట్ర పర్యటనలో నిమగ్నం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంచీపురం నుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టిన పన్నీర్ సెల్వం అందులో భాగంగా కోయంబత్తూరు చేరుకున్నారు.
మూడు రోజుల పాటు ఇక్కడే !
కోయంబత్తూరులోని ఆయుర్వేదశాలలో మూడు రోజుల పాటు పన్నీర్ సెల్వం చికిత్స పొందుతారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆ సందర్బంలో ఆయనను రాజకీయాల నుంచి దూరం పెట్టి పూర్తిగా విశ్రాంతి తీసుకునే విధంగా నాయకులు ప్లాన్ చేశారు.
అక్కడే పావులు కదపాలని !
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అక్కడి నుంచే పావులుకదపాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారని సమాచారం. ఎడప్పాడి పళనిసామి ఎత్తులకు పైఎత్తులు వెయ్యాలని తన వర్గంలోని నాయకులు పన్నీర్ సెల్వం సూచించారని తెలిసింది.
మొత్తం ఆయుర్వేద చికిత్స !
మధుమేహం, కీళ్లనొప్పులు, శ్వాసకోస తదితర సమస్యలకు కోయంబత్తూరులోని ఆయుర్వేదశాలలోనే చికిత్స పొందాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారని తెలిసింది. పలు ఆరోగ్య సమస్యలకు పూర్తి చికిత్స తీసుకోవాలంటే మూడు రోజులు అవసరం అని వైద్యులు సూచించారని పన్నీర్ సెల్వం వర్గీయులు అంటున్నారు.
పన్నీర్ సెల్వం ఆదేశాలతో !
ఆయుర్వేదశాలలో చికిత్సపొంది బయటకు వచ్చిన వెంటనే మళ్లీ రాష్ట్ర పర్యటన కొనసాగించాలని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చెయ్యాలని పన్నీర్ సెల్వం ఆయన వర్గీయులకు సూచించారని తెలిసింది. పన్నీర్ సెల్వం సూచనల మేరకు ఆయన వర్గంలోని నాయకులు చకచకా పావులు కదుపుతున్నారని తెలిసింది.