తేలిపోయిన చిన్నమ్మ: పన్నీరు ఎదురుదాడి
మంగళవారం రాత్రి మెరీనా బీచ్ వద్ద జయ సమాధి ముందు ‘ధ్యాన దీక్ష’ తర్వాత సంచలన వ్యాఖ్యలు చేసిన పన్నీర్ సెల్వం వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
చెన్నై: తమిళనాట ఆధిపత్యం కోసం అన్నాడీఎంకేలో తలెత్తిన పోరు పార్టీ చీలిక దిశగా అడుగులేస్తున్నది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వం వ్యూహం ముందు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళా నటరాజన్ తేలిపోయారు.
మంగళవారం రాత్రి మెరీనా బీచ్ వద్ద జయ సమాధి ముందు 'ధ్యాన దీక్ష' తర్వాత సంచలన వ్యాఖ్యలు చేసిన పన్నీర్ సెల్వం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పేరెత్తకుండానే పార్టీ ప్రధానకార్యదర్శి శశికళపై తిరుగుబావుటా ఎగురవేశారు. చిన్నమ్మపై పరోక్ష విమర్శలు గుప్పించారు. కానీ దీనికి ప్రతిగా స్పందించిన శశికళ శిబిరం.. పన్నీర్ సెల్వంను పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించింది.
ఆగమేఘాలపై పోయెస్ గార్డెన్స్లో అత్యవసర సమావేశం నిర్వహించిన తర్వాత బయటకు వచ్చి అభిమానులు, పార్టీ కార్యకర్తలకు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ అభివాదం చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడిన చిన్నమ్మ నేరుగా పన్నీర్ సెల్వంపై విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఐక్యంగానే ఉన్నారని, పార్టీలో ఎటువంటి గందరగోళం లేదని, తమదంతా ఒకే కుటుంబమని స్పష్టం చేశారు. డీఎంకే మద్దతుతోనే పన్నీర్ సెల్వం ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఆయనను బెదిరించి రాజీనామా చేయించారన్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు.
పార్టీ నుంచి పన్నీర్కు ఉద్వాసన
పన్నీర్ సెల్వంను సభ్యత్వంతోపాటు పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగిస్తారా? అంటే తప్పకుండా అని సమాధానమిచ్చారు. డిఎంకెకు లబ్ది చేకూర్చడానికే పన్నీర్ సెల్వం ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ తో ఆయన తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దీనికి నిదర్శనం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలేనని చెప్పారు. తమ పార్టీలో అంతర్గత పోరుకు బీజేపీకి సంబంధం లేదన్నారు. పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వెంటనే శశికళ ఏర్పాటు చేసిన సమావేశానికి 20 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు తెలిసింది. పోయెస్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా ఆమెకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. పన్నీర్ను పార్టీ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం ఎంపీ తంబిదురై విలేకరులతో మాట్లాడుతూ తమవైపు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. పన్నీర్ సెల్వం పార్టీకి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఈ కుట్ర వెనుక డీఎంకే హస్తముందని ఆరోపించారు. బుధవారం చెన్నైకి రానున్న రాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఏర్పాటు కోసం శశికళనే ఆహ్వానిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.
డోంట్ కేర్ అన్న పన్నీర్ సెల్వం
పార్టీ నుంచి బహిష్కరణపై పన్నీర్ సెల్వం కూడా ఘాటుగానే స్పందించారు. దేనికీ తాను భయపడబోనని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. తానే నిజమైన అన్నాడీఎంకే కార్యకర్తనన్నారు. ‘అసెంబ్లీలో ప్రతిపక్ష నేత స్టాలిన్ వైపు చూసి నవ్వడం నేరమేమీ కాదు. నవ్వడం నేరం కాదని నేను భావిస్తున్నా' అని శశికళ ఆరోపణలను తిప్పికొట్టారు. తనను పార్టీ కోశాధికారిగా అమ్మ నియమించారని, తననెవ్వరూ తప్పించలేరని స్పష్టం చేశారు. బుధవారం జరిగే పరిణామాల కోసం వేచి చూడాలని కోరారు. పన్నీర్ సెల్వం తిరిగి పీఠం ఎక్కేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన దరిమిలా సభలో బలనిరూపణ కీలక అంశంగా మారింది.
డిఎంకె మద్దతు అత్యవసరం
235 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 135 మంది సభ్యుల బలం ఉంది. ప్రతిపక్ష డీఎంకే నుంచి 89మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్పార్టీకి 8, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. పన్నీర్ ముఖ్యమంత్రి కావాలంటే ఆయనకు కనీసం 117మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ప్రస్తుతం ఆయనకు 62 మంది ఎమ్మెల్యేలు బేషరతుగా మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 55 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో అత్యధికులు శశికళ అనుచరులే కావడం వల్ల వారు పన్నీర్కు మద్దతునిచ్చే అవకాశాలు తక్కువ. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష డిఎంకే మాత్రమే ఆయనకు అండగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
శశికళకు సులభమేమీ కాదు..
పన్నీర్ సెల్వం తిరుగుబాటులో తమిళనాడు సీఎంగా శశికళా నటరాజన్ ప్రమాణ స్వీకారం అనుమానంగా కనిపిస్తున్నది. పార్టీలో ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా.. సెల్వంను ఏకాకిని చేసి, మిగతా ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన పరిస్థితి చిన్నమ్మది. ఇప్పటికే ఆమె కనీసం 50 మంది సభ్యుల మద్దతు కావాలి. దీంతో పార్టీలో చీలిక వచ్చినా పన్నీర్ వర్గాన్ని 15 మందికి మించనీయకూడదు. అందువల్ల ఈమెకు ఆ ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే కీలకం. పన్నీర్కి బీజేపీ మద్దతిస్తోంది కాబట్టి.. కాంగ్రెస్ శశికళకు సహకరిస్తే, ఆమె తనవైపున్నవారిని కాక మరికొంత మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోగలిగితే ఆమెకు సీఎం పదవి దక్కే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమెకు సహకరించేందుకు అనుకూల పరిస్థితులు లేవు. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె సీఎం కావడం ఒకింత కష్టమే.