అద్భుతమైన తండ్రికి గొప్ప కూతురు! ఇక డేరా బాధ్యత ఆమెదే! చిల్లర కోసం స్పెషల్ కరెన్సీ!?
అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అరెస్టయిన నేపథ్యంలో ఇక సచ్చా సౌదా మొత్తాన్ని నడిపించాల్సిన బాధ్యత ఆయన దత్త పుత్రిక హనీప్రీత్దే.
న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్కు ఓ కూతురు ఉంది. ఆమె పేరు హనీప్రీత్ సింగ్ ఇన్సాన్ (30). 'తండ్రి ముద్దుల కూతురు, పరోపకారి, దర్శకురాలు, సంపాదకురాలు, నటి' ఇవి సోషల్ మీడియాలో హనీ ప్రీత్ సింగ్ కు పరిచయ వాక్యాలు.
డేరా చీఫ్ గుర్మీత్కు ఈమె దత్త పుత్రిక. ఈమె ట్విటర్ అకౌంట్కు 10 లక్షల మంది, ఫేస్బుక్కు ఐదు లక్షల మంది ఫాలోవర్లున్నారు. తండ్రితో 'ఎంఎస్జీ 2 - ద మెసెంజర్', ఎంఎస్జీ - ద వారియర్ లయన్ హార్ట్' చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించారు.
అంతేకాదు గుర్మీత్ నటించిన చిత్రాలకు ఈమే దర్శకురాలు, ఎడిటర్ కావటం విశేషం. ఈమెకు సొంతంగా "www. HoneypreetInsan.me' అనే వెబ్సైట్ కూడా ఉంది. 'అద్భుతమైన తండ్రికి గొప్ప కూతురు' అని ఈ సైట్లో పెద్దగా రాసి ఉంటుంది.
'50 ఏళ్లు పూర్తి చేసుకున్న 'గురుపా'కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి చీకటి క్షణాన్ని తేజోవంతం చేసినందుకు ధన్యవాదాలు' అని ఆగస్టు 15న గుర్మీత్ పుట్టినరోజు సందర్భంగా హనీప్రీత్ ట్వీట్ చేశారు.
ఇప్పుడు తండ్రి గైర్హాజరీలో డేరా సచ్చా సౌదా మొత్తాన్ని నడిపించాల్సిన బాధ్యత హనీప్రీత్దే. గుర్మీత్ సీబీఐ కోర్టుకు వచ్చినపుడు తండ్రితోపాటుగా ఈమె కూడా వచ్చింది. గుర్మీత్ సింగ్ భార్య హర్జీత్ కౌర్. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.
సిర్సాలో ప్రత్యేక నగదు వ్యవస్థ?
డేరా సచ్చా సౌధా ప్రధాన కార్యాలయం ఉన్న సిర్సాలో గుర్మీత్ సింగ్ అనుచరులు ఏకంగా ప్రత్యేక నగదు వ్యవస్థను రూపొంచుకున్నారు. సుమారు 800 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుకాణాలు, కార్యాలయాల్లో ఈ ప్రత్యేక కరెన్సీ చెల్లుతుంది.
చిల్లర కొరతను అధిగమించేందుకు డేరా బాబా అనుచరులు రూ.10,రూ.5 ప్లాస్టిక్ కాయిన్లు, టోకెన్లను కస్టమర్లకు ఇస్తున్నారు. వీటిపై ధన్ ధన్ సద్గురు తేరాహీ ఆసరా.. డేరా సచ్చా సౌధా, సిర్సా అని ముద్రించి ఉంటుంది. ఈ టోకెన్లు, కాయిన్లను కస్టమర్లు దుకాణాల్లో ఇచ్చి తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఉదాహరణకు ఓ కస్టమర్ రూ.70 విలువైన వస్తువును కొనుగోలు చేసి రూ.100 ఇస్తే, మిగిలిన రూ.30కి మూడు ప్లాస్టిక్ టోకెన్లను ఇస్తారు. డేరా చీఫ్ గుర్మీత్ అరెస్టు నేపథ్యంలో సిర్సాలోని ప్రధాన ఆశ్రమానికి వెళ్లిన మీడియా ప్రతినిధులకూ భారత కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కాయిన్స్ ఇవ్వడం గమనార్హం.