వీడియో వైరల్: " పప్పా మా స్కూలుకు వచ్చావని మీ బాస్తో చెప్పు",కిరణ్ రిజిజూతో తన కూతురు
ఢిల్లీ: దేశానికి రాజైనా బిడ్డకు మాత్రం తండ్రే. మరి ఆ రాజు బిడ్డతో పాటు సాధారణ ప్రజల మధ్య కనిపిస్తే ఎలాగుంటుంది. అదే జరిగింది కేంద్ర మంత్రి కిరణ్ రిజుజూ విషయంలో. ఇక వివరాల్లోకి వెళితే... ఎంత బిజీగా ఉన్నప్పటికీ బిడ్డకోసం సమయం కేటాయించి ఆమె ఆనందానికి కారణం అయ్యారు కేంద్రమంత్రి కిరణ్ రిజెజూ. ఢిల్లీలో చదువుతున్న తన కూతురుతో పాటు గ్రాండ్ పేరెంట్స్ డేకు ఒక సాధారణ తండ్రిలా అక్కడికి వెళ్లారు. ఆ ఫోటోను కిరణ్ రిజెజు ట్విటర్లో షేర్ చేశారు.
నా కూతురు కళ్లల్లో ఆనందం చూశాను
"ఎట్టకేలకు నా సమయం నా కూతరికి కేటాయించినందుకు చాలా ఆనందంగా ఉంది. తన స్కూలులో జరిగిన గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకల్లో పాల్గొన్నాను. తాతయ్య నానమ్మలు లేనందున నేనే స్కూలుకు వెళ్లాను. నా కూతురు ఎంతో ఆనందించింది. తన కళ్లలో ఆ ఆనందం చూశాను" అంటూ కిరణ్ రిజిజూ ట్వీట్ చేశారు. స్కూల్ కారిడార్లో తన కూతురుతో పాటు పక్కనే కూర్చున్న ఫోటోను కిరణ్ రిజిజూ ట్విటర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు తను స్కూలుకు రావాల్సిందేనంటూ తన తండ్రిని చిన్నారి ఎలాగైతే ఒప్పించిందో ఆ వీడియోను కూడా కిరణ్ రిజిజూ పోస్ట్ చేశారు.
పప్పా నువ్వు తప్పకుండా మా స్కూలుకు రావాలి
"పప్పా... రేపు మాస్కూళ్లో గ్రాండ్ పేరెంట్స్ డే. మీరు తప్పకుండా రావాలి. అమ్మ ఎప్పుడూ స్కూలుకు వస్తుంది. మా ప్రదర్శన చూస్తుంది. నేను వేసే డాన్స్ను చూస్తుంది. మీరెప్పుడూ మా స్కూలుకు రారు. అది ఎలా సాధ్యమవుతుంది పప్పా? తాతయ్య నానమ్మలు చాలా దూరం నుంచి ఢిల్లీకి వస్తారు" అంటూ రిజిజూకు తన కూతురు చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది.
నాకూతురు స్కూలుకు వెళ్లానని మీ బాస్తో చెప్పు..క్షమిస్తాడులే
కూతురు మాటలకు ఆ బిజీ తండ్రి కరిగిపోయాడు. సరే ఎలాగైనా సరే స్కూలు వేడుకలు వీక్షించేందుకు తను వస్తానని, ఈ మధ్యకాలంలో చాలా బిజీ అయిపోయినట్లు రిజిజూ చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అంతేకాదు ఇందుకు కూతురు చెప్పిన సమాధానంతో షాక్ అయ్యాడు కిరణ్ రిజిజూ. " నీకు ఆఫీస్ ఉంది సరే... నీ కూతురు స్కూలుకు వెళ్లినట్లు మీ బాస్తో చెప్పు. ఇందుకు మీ బాస్ ఒప్పుకుని క్షమిస్తారు" అని ఎంతో ముద్దుగా సమాధానం చెప్పింది చిన్నారి. ఈ వీడియో దాదాపు 500 సార్లకు పైగా రీట్వీట్ చేయడం జరిగింది. నెటిజెన్లు చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ రాశారు. ఇక ఫోటో అయితే 2వేల మంది నెటిజెన్లు రీట్వీట్ చేశారు.
మొత్తానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు 47 ఏళ్ల కిరణ్ రిజిజూ. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొన్ని క్షణాలు కుటుంబంతో గడపడంలో చాలా సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. భారత గగనతలంలోకి పాకిస్తాన్ హెలికాఫ్టర్ దూసుకువచ్చిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ చాలా అప్రమత్తతతో ఉంది. ఇదే క్రమంలో కిరణ్ రిజిజూ కూడా చాలా బిజీగా ఉన్నారు. కానీ తన కూతురు కోరిన కోరికను కాదనలేకపోయారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూతురుతో గడిపిన ఆ కొద్ది క్షణాలు.. ఆమె కళ్లలో కనిపించిన ఆనందం తాను ఎప్పటికీ మరవలేనని ఏదో తెలియని సంతృప్తినిచ్చిందని కిరణ్ పేర్కొన్నారు.