అఖిలేశ్ 'బిగ్ మిస్టెక్': జవాను భార్యను అవమానించారని విమర్శలు
అమర జవాను కుటుంబాన్ని ఘోరంగా అవమానించారన్న విమర్శలు ఆయన మీద వెల్లువెత్తుతున్నాయి.
లక్నో: సమాజ్వాదీ పార్టీ యువనేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అమర జవాను కుటుంబాన్ని ఘోరంగా అవమానించారన్న విమర్శలు ఆయన మీద వెల్లువెత్తుతున్నాయి. జవాను భార్యకు సన్మానం చేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఒకరికి బదులు మరొకరికి ఆ సన్మానం చేయడంతో ఈ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. 1965ఇండో-పాక్ యుద్దంలో అబ్దుల్ హమీద్ అనే జవాన్ చనిపోయారు. అప్పట్లో ఆయనకు పరమవీరచక్ర అవార్డును కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం అబ్దుల్ హమీద్ భార్య రసూలన్ బీబీని అఖిలేష్ చేతుల మీదుగా సన్మానించేందుకు జంఘడ్ జిల్లా నాథ్ పూర్ లో ఓ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రసూలన్ బీబీ పేరు పిలిచినప్పుడు.. వేదిక పైకి ఓ 70ఏళ్ల వృద్దురాలు వచ్చింది. ఆమెకు సన్మానం చేసిన తర్వాత కానీ అఖిలేశ్ అండ్ పార్టీకి అసలు విషయం తెలియలేదు. నిజానికి ఆరోజు రసూలన్ బీబీ పేరు పిలవగానే వేరే మహిళ వేదిక మీదకు వచ్చారట. ఈ విషయాన్ని గమనించకుండా ఆమెకు సన్మానం చేసేసి కార్యక్రమాన్ని ముగించారు.
ఈ కార్యక్రమం తర్వాత అబ్దుల్ హమీద్ అసలు భార్య రసూలన్ బీబీ(90) స్పందించారు. ఆరోజంతా తాను ఇంట్లో ఉన్నానని, అలాంటప్పుడు నాకెలా సన్మానం చేశారని చెబుతున్నారంటూ ప్రశ్నించారు. విషయం బీజేపీకి తెలియడంతో అఖిలేశ్ పై విమర్శనాస్త్రాలు సంధించింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడి కుటుంబాన్ని అఖిలేశ్ దారుణంగా అవమానించారని మండిపడింది. సెప్టెంబర్ 10న తమ పార్టీ ఆమెను ఘనంగా సత్కరించబోతున్నట్లు తెలిపింది.
తప్పు తెలుసుకున్న ఎస్పీ:
సన్మాన కార్యక్రమంలో జరిగిన తప్పును ఎస్పీ ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ రామ్ సముజ్ యాదవ్ అనే అమర జవాన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగినట్లుగా ఎస్పీ నేతలు చెప్పారు. ఆ సందర్భంగా చుట్టు పక్కల అమర వీరుల కుటుంబాలను ఆహ్వానించగా.. జాబితాలో ఉన్న రసూలన్ బీబీ పేరు కూడా చదివినట్లు తెలిపారు. దీంతో ఓ 70 ఏళ్ల ఓ వృద్ధురాలు వేదికపైకి రావటంతో ఆమెకు అఖిలేష్ సన్మానం చేశారు.
అయితే ఆమె రసూలన్ బీబీ అవునో.. కాదో.. నిర్దారణ చేసుకోకుండా సన్మానం చేయడం తమ తప్పేనని ఎస్పీ అంగీకరించింది. ఎస్పీ తరుపున త్వరలోనే ఆమెను ఘనంగా సత్కరించబోతున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.