శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి కొత్త ప్రధాన అర్చకుడు: ఎలా ఎంపిక చేస్తారో తెలుసా?
తిరువనంతపురం: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కేరళలోని శబరిమల దేవస్థానానికి కొత్త ప్రధాన అర్చకుడి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. కొత్త ప్రధాన అర్చకుడిని దేవస్వొం బోర్డు ఎన్నుకుంది. శబరిమలతో పాటు మాలికాప్పురం ఆలయానికి కూడా కొత్త ప్రధాన అర్చకుడిని నియమించింది. కలెక్కాల్ మడోమ్ ఎన్ పరమేశ్వరన్ నంబూద్రి.. శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమితులయ్యారు. మాలికాప్పురం దేవస్థాన ప్రధాన అర్చకుడిగా కురువక్కడ్ శంభు నంబూద్రి ఎంపిక అయ్యారు.
నారాయణన్ నంబూద్రి, సుభద్ర అంతర్జనం దంపతుల కుమారుడు పరమేశ్వరన్. ఇదివరకు ఆయన హరిపద్లోని ఛెట్టికులంగారా ఆలయం, పంపా మహాగణపతి దేవస్థానాలకు ప్రధాన అర్చకుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఎవూర్లోని శ్రీకృష్ణస్వామి దేవస్థానంలో పని చేస్తోన్నారు. పరమేశ్వరన్ వివాహితుడు. ఆయన భార్య పేరు ఉమాదేవి అంతర్జనం. ఆయనకు ఇద్దరు కుమారులు నారాయణన్ నంబూద్రి, విష్ణు నంబూద్రి ఉన్నారు. పరమేశ్వరన్ స్వస్థలం అళప్పుజ జిల్లాలోని మావేలిక్కర.
ఈ ఉదయం శబరిమల ఆలయంలో నిర్వహించిన లక్కీ డ్రా సందర్భంగా పరమేశ్వరన్ను ఎంపిక చేశారు. తొలుత- ప్రధాన అర్చకుడి కోసం ఎంపిక చేసిన తొమ్మిదిమంది పేర్లు రాసిన చీటీలతో కూడిన ఓ వెండి పాత్రను అయ్యప్ప స్వామి వద్ద ఉంచారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. పూజల అనంతరం వెండి పాత్రను తెరచి అందులో చేతికి అందిన చీటీ ద్వారా ప్రధాన అర్చకుడి పేరును ప్రకటించారు. సుదీర్ఘకాలం నుంచి వస్తోన్న ఆనవాయితీ ప్రకారం.. పండలం కుటుంబీకులు ఈ లాటరీని తీయాల్సి ఉంటుంది.
పండలం కుటుంబీకుడు గోవింద వర్మ లాటరీ తీశారు. అందులో పరమేశ్వరన్ నంబూద్రి పేరు రావడంతో.. ఆయనను శబరిమల దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ప్రకటించారు. దేవస్వొం బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు, కేరళ హైకోర్టు పరిశీలకుడిగా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ భాస్కరన్.. ఈ లాటరీని పర్యవేక్షించారు. ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. కొత్తగా ప్రధాన అర్చకుడిగా ఎంపికైన పరమేశ్వరన్ నంబూద్రి.. ఈ నెల 21వ తేదీన బాధ్యతలను స్వీకరిస్తారు.
మాలికాప్పురం దేవి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ఎంపికైన శంభు నంబూద్రి.. స్వస్థలం కన్నూర్ జిల్లాలోని పరియారం. కోజికోడ్లో నివాసం ఉంటున్నారు. ఇప్పటిదాకా ఆయన పదిసార్లు ఈ పదవి కోసం దరఖాస్తును దాఖలు చేశారు. 11వ సారి ఆయనకు ఈ అదృష్టం వరించింది. ప్రస్తుతం ఆయన కన్నన్ఛేరి మహా గణపతి ఆలయానికి ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్నారు. 20 సంవత్సరాలుగా ఆయన అర్చక వృత్తిలో ఉంటున్నారు.