మోడీ స్వదేశీ మంత్ర- మిలట్రీ క్యాంటీన్లలో వెయ్యి విదేశీ ఉత్పత్తులకు రాం రాం....
కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో కుదేలైన దేశీయ పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం విదేశీ ఉత్పత్తులను మిలిటరీ క్యాంటీన్లలో నిషేధించాలని గతంలోనే నిర్ణయించింది. ప్రధాని 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన సందర్భంగా స్వదేశీ ఉత్పత్తులకు, తద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా ఉన్న మిలిటరీ క్యాంటీన్లలో వెయ్యికి పైగా విదేశీ ఉత్పత్తులను ఇక అమ్మరాదని నిర్ణయించింది.
ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తకు కరోనా పాజిటివ్: ఆ భవనం మూసివేత
మిలిటరీ క్యాంటీన్లలో నిషేధించిన విదేశీ ఉత్పత్తుల జాబితాలో స్కెచర్స్ ఫుట్ వేర్, రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్స్, టామీ-హిల్ ఫిగర్ షర్ట్ లతో పాటు డాబర్ ఉత్పత్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కే్ంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మొత్తం ఉత్పత్తులను మూడు కేటగిరీలుగా విభజించారు.
ఇందులో పూర్తిగా స్వదేశీ తయారీ, విదేశీ ముడిసరుకులతో స్వదేశంలో తయారీ, పూర్తిగా విదేశీ తయారీ ఉంటాయి. వీటిలో తొలి రెండు కేటగిరీ వస్తువులను మిలిటరీ క్యాంటీన్లలో విక్రయిస్తారు. ఈ మేరకు తమ ఉత్పత్తులు వీటిలో ఏ కేటగిరీ కిందకు వస్తాయో వివరాలు ఇవ్వాలని ఆయా వస్తువుల అమ్మకం దార్లకు ప్రభుత్వం సూచించింది. ఈ సమాచారం రాగానే విదేశీ ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ వాటిని క్యాంటీన్ల మెనూలో నుంచి తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.