అమృత్సర్లో అభినందన్ తల్లిదండ్రులు...ఘనస్వాగతం పలికిన స్థానికులు
పాకిస్తాన్ కస్టడీలో ఉన్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్ అభినందన్ వర్దన్ను శుక్రవారం విడుదల చేయనుంది ఆ దేశం. తన కొడుకు విడుదల కానున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి అమృత్ సర్కు చేరుకున్నారు అభినందన్ తల్లిదండ్రులు. అక్కడ వారికి స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది. అభినందన్ తిరిగి భారత్కు చేరుకోవడంతో అక్కడంతా పండగవాతావరణం నెలకొంది. ఇక అంతకుముందు చెన్నై నుంచి అభినందన్ తల్లిదండ్రులు ఢిల్లీకి గురువారం సాయంత్రం బయలు దేరి వెళ్లారు. తన కొడుకుకు స్వాగతం పలికేందుకు వారు గురువారం సాయంత్రం చెన్నై విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. విమానం ఎక్కగానే తోటి ప్రయాణికులు లేచి నిలబడి ఈ వీరుడి తల్లిదండ్రులకు సలామ్ కొట్టారు. అలాంటి బిడ్డను కన్నందుకు తాము గర్వపడుతున్నామని తల్లిదండ్రులు చెప్పారు.
అభినందన్ విడుదలకు ఇమ్రాన్ నిర్ణయంపై ఆయన భార్య, మాజీ భార్య ఏమన్నారో తెలుసా..?
ఢిల్లీకి చేరుకున్న తర్వాత అభినందన్ తల్లితండ్రులకు గౌరవ సూచకంగా ప్రయాణికులంతా లేచి నిలబడి వారు ముందుగా విమానం దిగేందుకు మార్గం సుగుమం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమృత్సర్లోని వాఘా సరిహద్దులో భారత అధికారులకు అభినందన్ను అప్పజెప్పనున్నారు.
ఇదిలా ఉంటే అభినందన్ కుటుంబం మొత్తం దేశసేవకే అంకితమైంది. అభినందన్ తండ్రి వర్థమాన్ భారత వాయుసేనలో పనిచేశారు. ఎయిర్ మార్షల్ హోదాలో రిటైర్ అయ్యారు. ఆయన స్వతహాగా పైలట్. పరం విశిష్ట సేవా మెడల్తో ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది. ఇక అభినందన్ తాత సింహకుట్టి కూడా రెండో ప్రపంచ యుద్ధంలో భారత వాయుసేన తరుపున పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం అభినందన్ విడుదల కానున్న నేపథ్యంలో అటారీ -వాఘా సరిహద్దు వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. వారందరినీ అదుపు చేయడం పోలీసుల వల్ల కావడం లేదు. ఇప్పటికే ఆ ప్రాంతంలో సెక్యూరిటీని టైట్ చేసింది ప్రభుత్వం.